ఐపీవో బాటలో రెండు కంపెనీలు | GNG Electronics Eleganz Interiors files IPO papers | Sakshi
Sakshi News home page

ఐపీవో బాటలో రెండు కంపెనీలు

Dec 16 2024 7:44 AM | Updated on Dec 16 2024 7:44 AM

GNG Electronics Eleganz Interiors files IPO papers

వినియోగించిన ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను పునరుద్ధరించే జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్‌ పబ్లిక్‌ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 825 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 97 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 320 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 260 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వెచ్చించనుంది. 

మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కంపెనీ ఎలక్ట్రానిక్స్‌ బజార్‌ బ్రాండుతో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, సర్వర్లు, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ తదితరాల పునర్వినియోగానికి వీలైన వేల్యూ చైన్‌ను నిర్వహిస్తోంది. విక్రయాలు, అమ్మకాల తదుపరి సర్వీసులు, వారంటీ సేవలు అందిస్తోంది. కొత్త ప్రొడక్టులతో పోలిస్తే 35–50 శాతం తక్కువ ధరలకే అందిస్తోంది. భారత్‌సహా యూఎస్, యూరప్, ఆఫ్రికా తదితర ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది.

ఎలిగంజ్‌ ఇంటీరియర్స్‌
ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ వద్ద ఎలిగంజ్‌ ఇంటీరియర్స్‌ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 60.05 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఐపీఓ అనంతరం షేర్లను ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేస్తామని పేర్కొంది.

సమీకరించిన నిధుల్లో రూ.25 కోట్లు రుణాలను చెల్లించేందుకు, రూ.30 కోట్లు మూలధన వ్యయానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తామని వివరించింది. ఈ ఇష్యూకు వివ్రో ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ బుక్‌ రన్నింగ్‌ మేనేజర్‌గా, బిగ్‌షేర్‌ సర్వీసెస్‌ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి. ఎలిగంజ్‌ ఇంటీరియర్స్‌ దేశవ్యాప్తంగా కార్పొరేట్, వాణిజ్య సంస్థలకు ఇంటీరియర్‌ ఫిట్‌ అవుట్‌ సేవలు అందిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement