టెక్ ప్రపంచంలో ఎవరైతే ముందుగా కొత్త సాంకేతికతను అందిస్తారో వారే విజేతలని అందరూ భావిస్తారు. 2023 ప్రారంభంలో జనరేటివ్ ఏఐ రంగంలో గూగుల్ ప్రత్యర్థుల కంటే వెనుకబడిందని విమర్శలు వెల్లువెత్తినప్పుడు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తన ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత ఈమెయిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆనాడు ఆయన చెప్పిన మాటలు, నేడు గూగుల్ సాధిస్తున్న రికార్డు స్థాయి విజయాల్లో ప్రతిబింబిస్తున్నాయి.
తొందరపాటు వద్దు..
ఏఐ రేసులో గూగుల్ వెనుకబడిందన్న వార్తల నేపథ్యంలో సుందర్ పిచాయ్ తన సిబ్బందికి ధైర్యాన్నిస్తూ ఒక సందేశం పంపారు. ‘గూగుల్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండటానికి తొందరపడలేదు. కానీ అత్యుత్తమంగా నిలవడానికి ప్రయత్నించింది’ అని ఆయన గుర్తు చేశారు. జీమెయిల్, క్రోమ్, ఆండ్రాయిడ్ వంటివి మార్కెట్లోకి వచ్చిన తొలి ఉత్పత్తులు కావు, కానీ వినియోగదారుల సమస్యలను అత్యంత సమర్థవంతంగా పరిష్కరించడం వల్లే అవి ప్రపంచాన్ని శాసించగలిగాయని ఆయన వివరించారు. నాణ్యత, సాంకేతిక బలం, దీర్ఘకాలిక ప్రభావంపైనే దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
జెమిని 3
సుందర్ నమ్మిన వ్యూహం నేడు సత్ఫలితాలను ఇస్తోంది. గూగుల్ అత్యాధునిక ఏఐ మోడల్ ‘జెమిని’ విడుదలైన తర్వాత కంపెనీ దశ మారిపోయింది. ప్రస్తుతం గూగుల్ సెర్చ్లో ‘ఏఐ ఓవర్వ్యూ’ ద్వారా జెమిని అన్నింట్లో పాగా వేసింది. ప్రతి నెలా మిలియన్ల మంది వినియోగదారులు జెమిని యాప్ను ఉపయోగిస్తుండగా వ్యాపార సంస్థలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి గూగుల్ ఏఐ సాధనాలను స్వీకరిస్తున్నాయి.
రికార్డు ఆదాయం
ఈ వ్యూహాత్మక మార్పుల ఫలితంగా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చరిత్ర సృష్టించింది. ఇటీవల కంపెనీ వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాకుండా ఏఐ కోసం ప్రత్యేక చిప్లు, అత్యాధునిక డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా గూగుల్ ఒక పూర్తిస్థాయి ఏఐ ఎకోసిస్టమ్ను సిద్ధం చేసింది. ఇది నిర్వహణ ఖర్చులను తగ్గించడమే కాకుండా పనితీరులో ప్రత్యర్థుల కంటే ముందుండడానికి సహాయపడిందని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్


