Forbes India 30 Under 30 2024: నెక్ట్స్‌ వేవ్‌ వ్యవస్థాపకులకు ఫోర్బ్స్‌ ఇండియా గుర్తింపు | Forbes India 30 Under 30 2024: Meet our young disruptors and trailblazers | Sakshi
Sakshi News home page

Forbes India 30 Under 30 2024: నెక్ట్స్‌ వేవ్‌ వ్యవస్థాపకులకు ఫోర్బ్స్‌ ఇండియా గుర్తింపు

Feb 16 2024 12:26 AM | Updated on Feb 16 2024 12:26 AM

Forbes India 30 Under 30 2024: Meet our young disruptors and trailblazers - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కి చెందిన అంకుర సంస్థ నెక్ట్స్‌ వేవ్‌ వ్యవస్థాపకులు శశాంక్‌ రెడ్డి గుజ్జుల, అనుపమ్‌ పెదర్లకు 2024 సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్‌ పత్రిక ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ జాబితాలో చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచి్చనందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వీరు ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం.

సూర్యాపేట జిల్లా హుజుర్‌ నగర్‌కు చెందిన శశాంక్‌ గుజ్జుల ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవగా.. ఏలూరుకు చెందిన అనుపమ్‌ పెదర్ల ఐఐటీ ఖరగపూర్లో బీటెక్‌ పూర్తి చేశాడు. పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో లేకపోవడంతో వారు ఉద్యోగాలు పొందలేకపోతున్నట్టు గుర్తించిన వీరు, సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. గొప్ప ఉద్యోగావకాశాలను కాదనుకొని గోదావరిఖనికి చెందిన రాహుల్‌ అత్తులూరితో కలిసి నెక్ట్స్‌వేవ్‌ను స్థాపించారు.

యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీలలో నైపుణ్యాలు పెంపొందిస్తూ ఐటీ ఉద్యోగాలు సొంతం చేసుకునే దిశగా వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మూడేళ్లలోనే దేశ విద్యా రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లో ఒకటిగా నెక్సŠట్‌ వేవ్‌ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ నుంచి 275 కోట్ల రూపాయల నిధులను సొంతం చేసుకుంది.

బహుళజాతి సంస్థలు సహా 1700 లకు పైగా కంపెనీలు వేలాది నెక్ట్స్‌ వేవ్‌ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. ఈ సందర్భంగా నెక్సŠట్‌ వేవ్‌ సహ వ్యవస్థాపకుడు శశాంక్‌ గుజ్జుల మాట్లాడుతూ ‘‘నెక్ట్స్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని గొప్ప అవకాశాలకు సొంతం చేసుకునేలా యువతని సిద్ధం చేయడంపైనే ఉండేది. ఇలాంటి గుర్తింపులు మరింత ఉత్సాహంగా మా లక్ష్యం వైపు అడుగు వేయడానికి తోడ్పడుతాయి’’అని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను దేశంలోని నలుమూలలకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని నెక్ట్స్‌ వేవ్‌ మరో సహ వ్యవస్థాపకుడైన అనుపమ్‌ పెదర్ల చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement