ఫేస్బుక్ రీల్స్, పోస్టుల నుంచే నేరుగా కొనుగోళ్లు
కంటెంట్ క్రియేటర్లకు కమీషన్ ఆధారిత ఆదాయం
తొలుత ఫేస్బుక్లో.. త్వరలో ఇన్స్ట్రాగ్రామ్కు విస్తరణ
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్, సోషల్ మీడియా దిగ్గజం మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికల ద్వారా క్రియేటర్ ఆధారిత షాపింగ్ను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని తెలిపింది.
ఇందులో భాగంగా కంటెంట్ క్రియేటర్లు ఫ్లిప్కార్ట్, మింత్రా వేదికలపై లభ్యమయ్యే ఉత్పత్తులను గుర్తించి, వాటిని నేరుగా తమ ఫేస్బుక్ పోస్టులు, రీల్స్లో ట్యాగ్ చేస్తారు. వినియోగదారులు ఆ ఉత్పత్తి ట్యాగ్లపై ట్యాప్ చేసి నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జరిగే ప్రతి విక్రయంపై క్రియేటర్లకు కమీషన్ లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ సేవలను తొలుత ఫేస్బుక్లో అందుబాటులోకి తెచ్చి, తదుపరి దశలో ఇన్స్ట్రాగామ్కు విస్తరించనున్నారు.
మారుతున్న కొనుగోలు ధోరణులు: ‘‘భారతీయ రిటైల్ రంగంలో జెన్ జెడ్ కొనుగోలు ధోరణులను ఫ్లిప్కార్ట్ రెండేళ్ల క్రితమే గుర్తించింది. ప్రస్తుతం కొనుగోలుదారులు సెర్చ్ బార్ల కంటే సోషల్ మీడియా ఫీడ్స్ ఆధారంగానే ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటున్నారు. క్రియేటర్లే కొత్త తరహా డిజిటల్ దుకాణాలుగా అవతరిస్తున్నారు. ఈ క్రమంలో మెటాతో కుదిరిన భాగస్వామ్యం కంటెట్ క్రియేటర్లను వ్యాపారవేత్తలుగా మార్చడమే కాకుండా, బ్రాండ్లు వినియోగదారులకు మరింత చేరువ అవుతాయి’’ అని ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఎఫ్వో రవి అయ్యర్ తెలిపారు.


