
భారత ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సిబుల్ స్టాఫ్(సంస్థలకు అనుకూలంగా అవసరం మేరకే నియమకం అయ్యే ఉద్యోగులు) విధానం కీలకంగా మారుతోంది. సంస్థలు ఈ ఫ్లెక్సీ స్టాఫ్ను ప్రధాన శ్రామిక శక్తిగా స్వీకరించడంతో ఏటా 15 శాతం వృద్ధి చెందుతున్న గిగ్ ఎకానమీలో 2030 నాటికి 9 లక్షల మంది నిపుణులు చేరుతారని ఒక నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశ ఐటీ / ఐటీఈఎస్ రంగంలో 3,90,000 ఫ్లెక్సీ స్టాఫ్ ఉన్నారు. ఇది ఈ రంగంలోని మొత్తం 5.8 మిలియన్ల నిపుణుల్లో 7 శాతం అని టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరియర్నెట్ నివేదికలో తెలిపింది. ‘ది రైజ్ ఆఫ్ ఫ్లెక్సీ స్టాఫింగ్: అవుట్లుక్ ఫర్ ఇండియా ఐటీ / ఐటీఈఎస్ టాలెంట్ ల్యాండ్ స్కేప్’ పేరుతో రిపోర్ట్ తయారు చేసింది.
2030 నాటికి ఈ ఫ్లెక్సీ స్టాఫ్ రెండింతలు పెరిగి 9,00,000కు చేరుకుంటుందని, 15 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్)తో వృద్ధి చెందుతుందని నివేదిక అంచనా వేసింది. రియల్ టైమ్ హైరింగ్ డేటా, మార్కెట్ రీసెర్చ్, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఆధారంగా కెరియర్నెట్ ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం భారత్ గ్లోబల్ ఆఫ్షోరింగ్ హబ్ కావడంతో ఐటీ/ ఐటీఈఎస్ సెక్టార్లో ఫ్లెక్సీ వర్కర్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. డిజిటల్ యాక్సిలరేషన్, ప్రపంచ ఆర్థిక మార్పుల మధ్య ఫ్లెక్సీ స్టాఫింగ్ నియామకం పెరుగుతుందని, స్పెషలైజేషన్, స్కేలబిలిటీకి మద్దతు ఇచ్చేందుకు ఈ నమూనాను చాలా కంపెనీలు అనుసరిస్తున్నట్లు కెరియర్నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలభ్ శుక్లా తెలిపారు.
ఇదీ చదవండి: పీఎస్యూల డీలిస్టింగ్ సరళతరం
ఐటీ/ఐటీఈఎస్ శ్రామిక శక్తిలో 25 శాతంతో ఫ్లెక్సీ స్టాఫ్ నియామల్లో బెంగళూరు దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ 15 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణె, చెన్నై సహా ఇతర ప్రధాన నగరాలు మొత్తం వాటాలో సుమారు 10 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఫ్లెక్సీ ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల్లో 20 శాతం మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది.