8.25 శాతం చెల్లింపునకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) సభ్యుల నిరీక్షణకు తెరపడనుంది. తమ భవిష్యనిధి ఖాతాల్లోని బ్యాలెన్స్లపై గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ ఈ నెల్లోనే జమ కానుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం కూడా లభించింది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ ఏడాది మార్చి 2న జరిగిన సమావేశంలో, ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 2025–26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును ఖరారు చేయడం తెలిసిందే.
కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తుంటారు. ఈపీఎఫ్వో సీబీటీ ఖరారు చేసిన 8.25 శాతం రేటుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కార్మిక శాఖ సూచనల మేరకు ఈ నెలలోనే సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేయనున్నట్టు తెలిపాయి.
కొత్త విధానంలో వడ్డీ జమ వెంటనే పూర్తి కానుందని పేర్కొన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023–24 సంవత్సరంలో 8.25 శాతానికి పెంచడం గమనార్హం. ఆ తర్వాత నుంచి ఇదే రేటు స్థిరంగా కొనసాగుతోంది. 2018–19లో అత్యధికంగా 8.65 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది.


