
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్పై కన్నేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఎక్స్ యూజర్లు ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్మెంట్.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.
ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!
‘వీసా’తో ఒప్పందం
వీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్ ప్లాట్ఫామ్ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీగా పిలిచే ఈ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు.