మాల్యాకు మరో షాక్‌

 ED seizes Vijay Mallya assets worth Rs 14.35 crore in France - Sakshi

14.35 కోట్ల  రూపాయల ఆస్తులను సీజ్‌చేసిన ఈడీ

సాక్షి,న్యూఢిల్లీ: ఆర్థికనేరగాడు, వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి షాక్‌ ఇచ్చింది. ఫ్రాన్స్‌లో 1.6 మిలియన్ యూరోల (రూ.14.35 కోట్లు) ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఈడీ అభ్యర్థన మేరకు ఫ్రెంచ్ అథారిటీ వీటిని స్వాధీనం చేసుకుంది. 32 అవెన్యూ ఫోచ్‌లో ఉన్న మాల్యా ఆస్తిని ఫ్రెంచ్ అధికారుల ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎంఎల్‌ఏ ఆరోపణలపై నిర్వహించిన దర్యాప్తులో భాగంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్యాంక్ ఖాతా నుండి పెద్ద మొత్తంలో నిధులను విదేశాలకు పంపినట్లు తేలిందని ఈడీ వెల్లడించింది. 2016 జనవరిలో దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుండి  ఇప్పటివరకు ఎటాచ్‌ చేసిన మాల్యా మొత్తం ఆస్తుల విలువ రూ .11,231.70 కోట్లకు చేరిందని పేర్కొంది. (మాల్యా అప్పగింతలో అడ్డంకులు ఏమిటి?)

కాగా వేల కోట్ల రూపాయల రుణాలను భారతీయ ప్రభుత్వ బ్యాంకులను ఎగవేసి లండన్‌లో  చెక్కేసిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే లండన్‌ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా, యుకె హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ మధ్య గత నెలలో జరిగిన చర్చల సందర్భంగా లిక్కర్‌ బారన్‌ అప్పగింత విషయాన్ని ప్రస్తావించింది. అలాగే 2021 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా  రానున్న  బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్,  విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ మధ్య  ఈ విషయం ప్రముఖంగాప్రస్తావనకు రానుందని భావిస్తున్నారు. మరోవైపు మాల్యాను భారత్‌కు అప్పగించడం కోసం యుకెలో పెండింగ్‌లో ఉన్న విచారణపై ఆరు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని నవంబర్ 2 న సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top