మాల్యా అప్పగింతలో అడ్డంకులు ఏమిటి? | Sakshi
Sakshi News home page

మాల్యా అప్పగింతలో అడ్డంకులు ఏమిటి?

Published Tue, Nov 3 2020 4:51 AM

Supreme Court Seeks Report On Vijay Mallya is Extradition - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను ఆ దేశం తిరిగి భారత్‌కు అప్పగించడంలో అడ్డంకులు ఏమిటని  కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. అలాగే ఇందుకు సంబంధించి కేంద్రం పేర్కొంటున్న ‘పెండింగు లో ఉన్న రహస్య న్యాయ ప్రక్రియ’ అంశాలను తెలియజేయాలనీ ఆదేశించింది. ఆయా అంశాల యథాతథ పరిస్థితిపై ఒక నివేదికను సమర్పి ంచాలని కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు సూచించింది.  ఇందుకు జస్టిస్‌ యూయూ లలిత్, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం కేంద్రానికి ఆరు వారాల గడువు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.  మాల్యా అప్పగింతకు సంబంధించి పూర్వాపరాల్లోకి వెళితే...

► విజయమాల్యా 2016 మార్చిలో బ్రిటన్‌కు పారిపోయారు
► 2017లో ఏప్రిల్‌ 18న అప్పగింత వారెంట్‌పై ఆయనను అరెస్ట్‌ చేయగా, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.  
► 2018 డిసెంబర్లో చీఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు అప్పగింతకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.
► దీన్ని 2020 ఏప్రిల్‌లో బ్రిటన్‌ హైకోర్టు సమర్థించింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకూ అనుమతి ఇవ్వలేదు. అప్పీల్‌కు అనుమతించాలన్న మాల్యా పిటిషన్‌ను మే 14వ తేదీన కొట్టివేసింది. సాధారణ ప్రజా ప్రాముఖ్యత కోణంలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చన్న న్యాయపరమైన అంశాన్ని ధ్రువీకరించేందుకు తిరస్కరిస్తున్నట్లు లండన్‌లోని రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం  తేదీన స్పష్టం చేసింది. యూకే ఎక్సŠట్రాడిషన్‌ యాక్ట్‌ 2003 చట్టంలోని సెక్షన్‌ 36, సెక్షన్‌ 116 కింద అప్పగింత ప్రక్రియను నిర్దేశించిన 28 రోజుల్లోపు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది.  
► అయితే ఆయన అప్పగింతకు ముందు కొన్ని చట్టపరమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని బ్రిటన్‌ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ఎంతకాలం పడుతుందన్నది చెప్పలేమని బ్రిటన్‌ హై కమిషన్‌ ప్రతినిధి చెప్పారు. మరిన్ని వివరాలు వెల్లడించలేమనీ ప్రతినిధి చెప్పారు.  
► మరోవైపు, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ, మాల్యా తన పిల్లలకు 40 మిలియన్‌ డాలర్లను బదలాయించడం ధిక్కరణ కిందకే వస్తుందని 2017లో వచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్‌ను ఆగస్టు 31న కొట్టివేసింది.

Advertisement
Advertisement