ఉద్యోగులకు 10 రోజుల ‘సెలవు’.. కానీ ట్విస్ట్‌ తెలిస్తే.. | Diamond company Sends 50000 Employees On 10 Day Vacation with salary cut | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు 10 రోజుల ‘సెలవు’.. కానీ ట్విస్ట్‌ తెలిస్తే..

Aug 8 2024 3:30 PM | Updated on Aug 8 2024 5:04 PM

Diamond company Sends 50000 Employees On 10 Day Vacation with salary cut

దేశ వజ్రాల పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. మాంద్యం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ తగ్గింది. దీంతో దని పేర్కొంటూ సూరత్‌కు చెందిన ఒక ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ ఏకంగా 50,000 మంది ఉద్యోగులకు 10 రోజులపాటు 'సెలవు' ప్రకటించింది.

ప్రపంచంలో అతిపెద్ద సహజ వజ్రాల తయారీదారైన కిరణ్ జెమ్స్ కంపెనీ ఆగస్టు 17 నుంచి 27 వరకు 10 రోజులు 'సెలవు' ప్రకటించింది. "మా 50,000 మంది ఉద్యోగులకు 10 రోజుల సెలవు ప్రకటించాం. దీని కోసం కొంత మొత్తం కోత విధించినప్పటికీ, ఉద్యోగులందరికీ ఈ కాలానికి జీతం చెల్లిస్తాం. మాంద్యం కారణంగా ఈ సెలవులను ప్రకటించవలసి వచ్చింది'' అని కిరణ్ జెమ్స్ చైర్మన్ వల్లభాయ్ లఖానీ వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.

ప్రపంచంలోని దాదాపు 90 శాతం వజ్రాలను ప్రాసెస్ చేసే స్థానిక వజ్రాల పరిశ్రమను మాంద్యం దెబ్బతీసిందన్న లఖానీ అభిప్రాయాలతో సూరత్ డైమండ్ అసోసియేషన్ అధ్యక్షుడు జగదీష్ ఖుంట్ ఏకీభవించారు. "కిరణ్ జెమ్స్ ఇలా సెలవు ప్రకటించడం (ఉద్యోగులకు) ఇదే మొదటిసారి. ఇంతవరకు మరే ఇతర సంస్థ కూడా ఇటువంటి చర్య తీసుకోనప్పటికీ, మాంద్యం పాలిష్ చేసిన వజ్రాల అమ్మకాలను తగ్గించింది" అని ఖుంట్ అన్నారు.

పాలిష్ చేసిన వజ్రాలు అత్యధికం ఎగుమతి చేస్తున్నందున అంతర్జాతీయ కారకాలు వజ్రాల అమ్మకాన్ని ప్రభావితం చేస్తాయని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలను కొన్ని కారకాలుగా ఆయన పేర్కొన్నారు. ఈ కారకాలతో 2022లో దాదాపు రూ. 2,25,000 కోట్లున్న వజ్రాల పరిశ్రమ టర్నోవర్ నేడు రూ. 1,50,000 కోట్లకు తగ్గిందన్నారు. సూరత్‌లో దాదాపు 4,000 డైమండ్ పాలిషింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు దాదాపు 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement