దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు దేశ ఆతిథ్య రంగానికి అనూహ్యమైన డిమాండ్ను తెచ్చిపెట్టింది. వివిధ దేశాల నాయకులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు, భద్రతా సిబ్బంది, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని ప్రముఖ ఫైవ్ స్టార్ లగ్జరీ హోటళ్లన్నీ దాదాపు పూర్తిగా నిండిపోయాయి.
రూ.2.5 లక్షలకు పైగానే..
మధ్య ఢిల్లీ, ఏరోసిటీ పరిధిలోని తాజ్ మహల్ హోటల్, ఐటీసీ మౌర్య, ది లీలా ప్యాలెస్, ది ఒబెరాయ్, ది లాధి.. వంటి అత్యున్నత స్థాయి హోటల్ గదుల కొరత ఏర్పడింది. డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో నిమిషాల్లో గదుల ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణంగా రోజుకు రూ.18,000 వరకు ఉండే సూట్ లేదా ప్రీమియం గదుల అద్దెలు సదస్సు సమయంలో రోజుకు రూ.1 లక్ష నుంచి రూ.2.5 లక్షల (పన్నులు అదనం) వరకు పలుకుతున్నాయి. ఐటీసీ మౌర్య, లీలా ప్యాలెస్ వంటి హోటళ్లలో లగ్జరీ సూట్ల అద్దె పన్నులతో కలిపి రూ.2.5 లక్షలకు పైగానే దాటినట్లు పర్యాటక బుకింగ్ ప్లాట్ఫామ్లు వెల్లడించాయి.
అన్ని హోటళ్లపై ప్రభావం
ఈ సదస్సు ప్రభావం కేవలం విలాసవంతమైన హోటళ్లకే పరిమితం కాకుండా ఢిల్లీలోని నాలుగు నక్షత్రాల హోటళ్లు, బడ్జెట్ హోటళ్లపై కూడా తీవ్రంగా పడింది. ట్రావెల్ ప్లాట్ఫామ్స్ డేటా ప్రకారం ఫైవ్ స్టార్ హోటళ్ల కోసం సెర్చ్ 50% పెరగ్గా, హోటల్ బుకింగ్లలో 25-138% వరకు వార్షిక వృద్ధి నమోదైంది. గ్లోబల్ డిప్లొమాటిక్ ఈవెంట్స్ వేళ లగ్జరీ గదుల లభ్యత తగ్గిపోవడంతో ధరల్లో ఈ స్థాయిలో డైనమిక్ ప్రైసింగ్ పెరిగిందని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. జియోపొలిటికల్ ప్రాధాన్యత కలిగిన ఈ అంతర్జాతీయ సదస్సు భారత రాజధానికి అంతర్జాతీయ పర్యాటక, వ్యాపార రంగాల్లో కొత్త ఊపును తెచ్చిపెట్టడమే కాకుండా, స్థానిక ఆతిథ్య పరిశ్రమ ఆదాయానికి అతిపెద్ద తోడ్పాటును అందించింది.
ఇదీ చదవండి: బొజ్జ గణపయ్య రూపంలో బిలియనీర్ సీక్రెట్స్!


