దలాల్ స్ట్రీట్‌ను ముంచెత్తిన అమ్మకాల వరద! | Dalal Street Crashes Global Tensions Oil Surge AI Selloff Trigger Market Bloodbath | Sakshi
Sakshi News home page

దలాల్ స్ట్రీట్‌ను ముంచెత్తిన అమ్మకాల వరద!

Jun 8 2026 5:27 PM | Updated on Jun 8 2026 5:32 PM

Dalal Street Crashes Global Tensions Oil Surge AI Selloff Trigger Market Bloodbath

భారత స్టాక్ మార్కెట్‌ ఈ వారం తొలి సెషన్‌లోనే తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముడిచమురు ధరల మంట దేశీయ మార్కెట్లను కుప్పకూల్చాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలతో సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 243 పాయింట్లు నష్టపోయి 23,123 వద్ద స్థిరపడింది. మరోవైపు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 719 పాయింట్లు దిగజారి 73,524 వద్ద ముగిసింది. మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విక్స్ ఏకంగా 7.25% పెరిగి 16.93 మార్కుకు చేరడం మదుపరుల్లో ఉన్న తీవ్ర ఆందోళనను ప్రతిబింబిస్తోంది. భారత ఈక్విటీ మార్కెట్ ఇంతలా కుప్పకూలడానికి ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయం, ద్రవ్యోల్బణ భయాలు కారణమయ్యాయి.

యుద్ధ సంక్షోభం తీవ్రతరం

మార్కెట్లను కుదిపేసిన అత్యంత కీలకమైన అంశం పశ్చిమ ఆసియా సంక్షోభం. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య దాడులు, తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన దాడుల కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదరాల్సిన శాంతి ఒప్పందాలపై ఈ పరిణామాలు నీళ్లు చల్లడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. యుద్ధ భయాల నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడులవైపు మదుపరులు మొగ్గు చూపడం మార్కెట్ల పతనానికి దారితీసింది.

ముడిచమురు ధరలు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా రవాణాకు ఆటంకం కలుగుతుందనే భయాలు పెరిగాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 4.5% పైగా పెరిగి బ్యారెల్‌కు 97.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడే భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ క్షీణిస్తుందనే ఆందోళన ఇన్వెస్టర్లను వెంటాడింది.

టెక్‌ షేర్లలో అమ్మకాల వెల్లువ

గత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లను పరుగులు పెట్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక రంగానికి చెందిన షేర్లలో అంతర్జాతీయంగా ప్రాఫిట్ బుకింగ్ ఊపందుకుంది. ఈ ఏఐ ర్యాలీ అత్యంత వేగంగా, పరిమితికి మించి జరిగిందన్న భయాలతో గ్లోబల్ ఇన్వెస్టర్లు టెక్ షేర్లను విక్రయించారు. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లతో పాటు భారత ఐటీ రంగంపైనా స్పష్టంగా కనిపించింది.

ఆర్‌బీఐ నెమ్మదించిన వృద్ధి అంచనాలు

ఇటీవలి ద్రవ్య పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ రాబోయే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.9% నుంచి 6.6%కి తగ్గించింది. అలాగే ద్రవ్యోల్బణం అంచనాను 5.1%కి పెంచడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే ఉంచవచ్చనే సంకేతాలు తోడయ్యాయి.

ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

Advertisement
 
Advertisement
Advertisement