వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! | Solar Waste Crisis Hidden Gold Opportunity in India Green Energy Journey | Sakshi
Sakshi News home page

వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

Jun 6 2026 9:07 AM | Updated on Jun 6 2026 9:17 AM

Solar Waste Crisis Hidden Gold Opportunity in India Green Energy Journey

భారతదేశ పునరుత్పాదక ఇంధన ప్రస్థానం గత దశాబ్ద కాలంగా చాలా వృద్ధిని నమోదు చేస్తోంది. జాతీయ సౌర ఇంధన మిషన్ (నేషనల్‌ సోలార్‌ మిషన్‌) ప్రారంభమైనప్పటి నుంచి రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సౌర విద్యుత్ సామర్థ్యం ఊహించని రీతిలో విస్తరించింది. అయితే, ఈ విజయవంతమైన ప్రయాణం వెనుక ఒక క్లిష్టమైన, ఇప్పటివరకు పెద్దగా చర్చకు రాని సవాలు దాగి ఉంది. అదే.. కాలం తీరిన సోలార్ ప్యానెళ్ల భవిష్యత్తు ఏమిటనేది! సాధారణంగా సోలార్ ప్యానెళ్ల జీవితకాలం 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. భారతదేశపు తొలి విడత సోలార్ ప్రాజెక్టులు ఇప్పుడు వాటి జీవితకాలంలో సగానికి చేరుకున్నాయి. అంటే, రాబోయే దశాబ్దంలో దేశంలో పెద్ద ఎత్తున నిరుపయోగమైన సోలార్ ప్యానెళ్ల వ్యర్థాలు పేరుకుపోనున్నాయి.

వ్యర్థాల ముప్పు

అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఐఆర్‌ఈఎన్‌ఏ) అంచనాల ప్రకారం.. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా సౌర వ్యర్థాలు సుమారు 7.8 కోట్ల టన్నులకు చేరే ప్రమాదం ఉంది. వందల గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న భారతదేశానికి ఇది భవిష్యత్తులో ఒక భారీ పర్యావరణ సవాలుగా మారనుంది. సాధారణ వ్యర్థాల లాగా కాకుండా సోలార్ ప్యానెళ్లలో గ్లాస్, సిలికాన్, లోహాలు, పాలిమర్లు ఉంటాయి. వీటిని శాస్త్రీయంగా రీసైకిల్ చేయకుండా పారేస్తే.. వాటిలోని సీసం (లెడ్‌), కాడ్మియం వంటి ప్రమాదకరమైన రసాయనాలు నేలలోకి, భూగర్భ జలాల్లోకి చేరి పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి.

వ్యర్థాల నుంచే సంపద సృష్టి

ఈ ముప్పులోనూ భారతదేశానికి ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశం దాగి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సోలార్ ప్యానెళ్లలో అత్యంత విలువైన హై-ప్యూరిటీ సిలికాన్, వెండి, అల్యూమినియం, రాగి వంటి లోహాలు ఉంటాయి. వీటిని తిరిగి సేకరించడం ద్వారా ముడిపదార్థాల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. సోలార్ సెల్స్‌లో కీలకమైన వెండి ఖరీదైనది, పరిమితమైనది. రీసైక్లింగ్ ద్వారా దీనిని తిరిగి పొందితే తయారీ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ప్యానెళ్ల నుంచి సేకరించిన సిలికాన్‌ను శుద్ధి చేసి తిరిగి సోలార్ ప్యానెళ్ల తయారీలో లేదా సెమీకండక్టర్ పరిశ్రమలో ఉపయోగించవచ్చు.

రీసైక్లింగ్ పద్ధతులు - సవాళ్లు

మెకానికల్ పద్ధతి: ప్యానెళ్లను ముక్కలు చేయడం లేదా నుజ్జు చేయడం. ఇందులో గ్లాస్‌ను సులభంగా వేరు చేయవచ్చు. కానీ లోహాలు, సిలికాన్ నాణ్యత తక్కువగా ఉంటుంది.

థర్మల్ (పైరోలిసిస్): అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం. ఇందులో ప్యానెల్‌లోని ప్లాస్టిక్ పొరలను తొలగించి లోహాలను వేరే చేసేందుకు వీలవుతుంది. అయితే ఈ పద్ధతిలో నియంత్రణ లేకపోతే ప్రమాదకర వాయువులు విడుదలవుతాయి.

కెమికల్ (రసాయన): సాల్వెంట్లు లేదా ఆమ్లాల (యాసిడ్స్‌) వినియోగం. ఇందులో అత్యధిక నాణ్యతతో కూడిన లోహాల రికవరీ సాధ్యమవుతుంది. కానీ ఎక్కువ ఇంధన వినియోగం, నిర్వహణ సంక్లిష్టత, రసాయన వ్యర్థాల ముప్పు ఉంటుంది.

  • ప్రస్తుతానికి సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణహితమైన ప్రామాణిక పద్ధతి లేకపోవడం ఈ రంగానికి పెద్ద అడ్డంకిగా మారింది.

అంతర్జాతీయ విధానాలు.. భారత నియంత్రణ వ్యవస్థ

భారతదేశం ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు-2022 ద్వారా సర్క్యులర్ ఎకానమీ వైపు ప్రాథమికంగా అడుగులు వేసినప్పటికీ సోలార్ వ్యర్థాల నిర్వహణకు ఇంకా పూర్తిస్థాయి ప్రత్యేక చట్టపరమైన నిబంధనలు లేవు. అంతర్జాతీయంగా చూస్తే ఆస్ట్రేలియా ప్రభుత్వం ‘నేషనల్ సోలార్ ప్యానెల్ రీసైక్లింగ్ పైలట్ ప్రాజెక్ట్’ కోసం మూడు సంవత్సరాల కాలానికి 24.7 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. యూరప్ దేశాల్లో ‘ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్‌)’ విధానం అమలులో ఉంది. దీని ప్రకారం సోలార్ ప్యానెళ్లను తయారు చేసిన సంస్థలే వాటి జీవితకాలం ముగిశాక రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. భారతదేశంలోనూ ఇటువంటి స్పష్టమైన విధానాలు రావలసి ఉంది.

ముందున్న కార్యాచరణ(నిపుణుల సూచనలు)

  • సోలార్ ప్యానెల్ తయారీదారులు, డెవలపర్లకు ఈపీఆర్‌ని తప్పనిసరి చేయాలి.

  • రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలి.

  • ప్రతి సోలార్ మాడ్యూల్ జీవితకాలాన్ని పర్యవేక్షించడానికి డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకురావాలి.

  • దేశీయ విద్యా, పరిశోధనా సంస్థలు లేజర్ ఆధారిత డీలామినేషన్, హై-వోల్టేజ్ సెపరేషన్ వంటి అధునాతన పద్ధతులపై దృష్టి సారించాలి. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) ద్వారా స్టార్టప్‌లు ఏఐ ఆధారిత మెటీరియల్ రికవరీ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయాలి.

ఇదీ చదవండి: మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం!

Advertisement
 
Advertisement
Advertisement