
సాక్షి, సిటీబ్యూరో: కాలం ఏదైనా సరే ఇంట్లో నీరు, విద్యుత్ వినియోగం తప్పనిసరి. వేసవికాలంలో అయితే వీటి బిల్లులతో కస్టమర్ల జేబుకు చిల్లులు పడటం ఖాయం. అందుకే హరిత నిర్మాణ సామగ్రితో నిర్మించే ఇళ్లకు ఆదరణ పెరుగుతోంది. హరిత భవనాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు విద్యుత్ వినియోగం 30–40 శాతం, నీటి వినియోగం 20–30 శాతం తగ్గుతుంది కూడా.
విద్యుత్, నీటి బిల్లుల ఆదా, నిర్వహణ వ్యయం తగ్గింపు, ఆరోగ్యకరమైన వాతావరణ వంటి కారణాలతో హరిత భవనాలకు డిమాండ్ పెరిగింది. గతంలో పర్యావరణహితమైన ఇల్లు కొనాలంటే కాలుష్యం, జనాభా తక్కువగా ఉండే ప్రాంతాలకు లేక శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ, నేడు నగరంలో, హాట్సిటీలో ఉంటూ కూడా హరిత భవనాలు కావాలంటున్నారు కొనుగోలుదారులు. దీంతో నిర్మాణ సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన గృహాలనే కాదు.. ఐజీబీసీ గుర్తింపు పొందిన నిర్మాణ సామాగ్రిని, ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి.
మార్కెట్లో 350 రకాల ఉత్పత్తులు..
నివాసాలకు, వాణిజ్య, కార్యాలయాల సముదాయాలకూ హరిత భవనాల గుర్తింపునివ్వటం మనకు తెలిసిందే. కానీ, దేశంలో తొలిసారిగా నిర్మాణ సామగ్రి ఉత్పత్తులకూ గుర్తింపు ప్రారంభించింది సీఐఐ. దీంతో కొనుగోలుదారులకు గృహాల్లోనే కాకుండా నిర్మాణ సామగ్రిలోనూ గ్రీన్ ప్రొ సర్టిఫికెట్ పొందిన ఉత్పత్తులను ఎంపిక చేసుకునే వీలుందన్నమాట. ఇప్పటి వరకు 350 ఉత్పత్తులు గ్రీన్ సర్టిఫికెట్ పొందాయి. ఏసీసీ సిమెంట్, నిప్పన్ పెయింట్స్, సెయింట్ గోబియన్ గ్లాస్, అసాహి ఇండియన్ గ్లాస్, గోద్రెజ్ ఫర్నీచర్, విశాఖ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. దేశంలో గ్రీన్ బిల్డింగ్స్ ఉత్పత్తుల మార్కెట్ రూ.18 లక్షల కోట్లుగా ఉందని అంచనా.