బ్యాంకింగ్ రంగంలో అధికారిక భాషా విధాన అమలులో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తొలి ‘రాజభాషా కీర్తి పురస్కారం’ దక్కింది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాజభాషా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత రాజభాషా సదస్సులో ఈ పురస్కారాన్ని బ్యాంక్కు అందజేశారు.
సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రథమ బహుమతిగా అందించిన రాజభాషా షీల్డ్ను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా చేతుల మీదుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కల్యాణ్ కుమార్ స్వీకరించారు. అధికారిక భాషా నియమాలను సమర్థవంతంగా అమలు చేయడం, హిందీ భాషా విస్తరణకు సంస్థాగతంగా కృషి చేయడం వల్లే ఈ అరుదైన గుర్తింపు లభించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
శతాబ్ది సంచిక విడుదల
ఈ సదస్సు వేదికగా బ్యాంక్కు చెందిన ప్రతిష్ఠాత్మక ద్విభాషా అంతర్గత పత్రిక ‘సెంట్రలైట్’ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక ‘హెరిటేజ్ ఎడిషన్’ను ఆవిష్కరించారు. శతాబ్ద కాలంగా బ్యాంకింగ్ వర్గాలకు, సిబ్బందికి సమాచార వారధిగా నిలిచిన ఈ పత్రిక వైభవాన్ని ఈ ప్రత్యేక సంచికలో ఆవిష్కరించారు.
115 ఏళ్ల చరిత్ర ప్రతిబింబించేలా ప్రదర్శన
బ్యాంక్ సాధించిన ప్రగతి, అధికారిక భాషా రంగంలో సాధించిన విజయాలు, బ్యాంకింగ్ ఆవిష్కరణలను చాటిచెప్పేలా 115 సంవత్సరాల ప్రస్థానంతో కూడిన ప్రత్యేక ప్రదర్శనను (ఎగ్జిబిషన్) ఏర్పాటు చేశారు. వివిధ నమూనాలు, డిజిటల్ ప్రదర్శనల ద్వారా బ్యాంక్ సుదీర్ఘ వారసత్వాన్ని, సాంకేతిక పురోగతిని సందర్శకులకు వివరించారు.
ఇదీ చదవండి: బోరుమని ఏడ్చేసిన నిర్మలా సీతారామన్


