లాభాలకు తగ్గట్లు జీతాలు పెంచండి  | CEA calls for striking balance between corporate profitability, workers income | Sakshi
Sakshi News home page

లాభాలకు తగ్గట్లు జీతాలు పెంచండి 

May 30 2025 12:41 AM | Updated on May 30 2025 8:18 AM

CEA calls for striking balance between corporate profitability, workers income

మరింతగా ఇన్వెస్ట్‌ చేయండి 

అప్పుడే సుస్థిర వృద్ధి సాధ్యం 

కంపెనీలకు సీఈవో అనంత నాగేశ్వరన్‌ సూచన 

న్యూఢిల్లీ: లాభదాయకతకు అనుగుణంగా పెట్టుబడులు, ఉద్యోగుల వేతనాలను పెంచడంపై దృష్టి పెట్టాలని కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ సూచించారు. అప్పుడే భారత్‌ 6.5 శాతం పైగా ఆర్థిక వృద్ధిని నిలకడగా సాధించగలదని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలదని ఆయన చెప్పారు. పెట్టుబడుల సానుకూల వలయాన్ని వివరిస్తూ, ఇన్వెస్ట్‌మెంట్లతో సామర్థ్యాలు పెరగడంతో పాటు మరింత అధిక వేతనాలతో మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఇది కుటుంబాలు ఇంకాస్త ఎక్కువ పొదుపు చేసేందుకు దోహదపడుతుందని నాగేశ్వరన్‌ చెప్పారు.

 కానీ ప్రస్తుతం వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంటోందని, వచ్చే 25 లేదా 30 ఏళ్ల పాటు ఇదే తీరు కొనసాగితే నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగా పురోగమించలేమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి సమస్య సంపన్న దేశాల్లోనే కనిపిస్తుందే తప్ప భారత్‌లాంటి వర్ధమాన దేశాల్లో ఉండదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్‌ చెప్పారు. 21వ శతాబ్దపు రెండో దశాబ్దంలో భారతీయ ప్రైవేట్‌ రంగ లాభదాయకత రూ. 7.2 లక్షల కోట్ల నుంచి రూ. 28.7 లక్షల కోట్లకు నాలుగు రెట్లు పెరిగినప్పటికీ, పెట్టుబడులు మాత్రం మూడు రెట్లే పెరిగాయని ఆయన చెప్పారు.  

ఇన్‌ఫ్రాలో కూడా ఇన్వెస్ట్‌ చేయాలి.. 
రాబోయే 25 ఏళ్లలో మౌలిక సదుపాయాలతో పాటు సామర్థ్యాల పెంపుపై భారత్‌ గణనీయంగా ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుందని, ప్రైవేట్‌ రంగం ఇటు పెట్టుబడులు అటు ఉద్యోగుల వేతనాల మధ్య సమతూకం ఉండేలా చూసుకోవాలని నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. కుటుంబాల ఆదాయాలు, పొదుపు పెరిగితేనే నిలకడగా వృద్ధి సాధ్యపడుతుందని వివరించారు. పెట్టుబడులతో మరిన్ని ప్రయోజనాలను రాబట్టాలంటే పరిశ్రమలపై రెగ్యులేటరీ భారం తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ప్రైవేట్‌ రంగం మధ్య విశ్వసనీయత పెరగాలని నాగేశ్వరన్‌ చెప్పారు. 

కొన్ని సార్లు నియంత్రణ సంస్థలపరంగా దేన్ని డీరెగ్యులేట్‌ చేయాలనే దానిపై స్పష్టత ఉన్నప్పటికీ ఎలా చేయాలనేది సవాలుగా ఉంటుందని ఆయన తెలిపారు. నియంత్రణల తొలగింపు అనేది కొన్ని సందర్భాల్లో అవాంఛితమైన విధంగా దురి్వనియోగానికి కూడా దారి తీసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. వికసిత భారత్‌ లక్ష్యాలు సాధించాలంటే ఇరుపక్షాలు పరస్పరం నమ్మకంతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. 

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాకుండా, దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రైవేట్‌ రంగం మధ్య కూడా నమ్మకం ఉండాలి. సమిష్టిగా కలిసి పని చేస్తే తప్ప వచ్చే 25 ఏళ్లలో మనం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాన్ని సాధించలేం‘ అని నాగేశ్వరన్‌ చెప్పారు. మరోవైపు, ఎకనమిక్‌ సర్వేలో పేర్కొన్నట్లు భారత్‌ 6.3–6.8 శాతం మధ్య వృద్ధి రేటును నమోదు చేసిందని .. రుతుపవనాలు మెరుగ్గా ఉండటం, ప్రభుత్వ పెట్టుబడుల దన్ను, పన్నులపరమైన ఉపశమనం, వడ్డీ రేట్ల తగ్గుదల తదితర సానుకూలాంశాలతో ఇదే స్థాయి వృద్ధి సుదీర్ఘకాలం పాటు కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement