
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త 5జీ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారి క్యూ-5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (Q-5G FWA) లాంచ్ చేసింది. ఇది సంస్థలకు, కార్యాలయాలకు సిమ్ రహిత, వైర్లెస్ పరిష్కారాన్ని అందిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
ఏమిటీ క్యూ-5జీ?
క్యూ-5జీ.. ఇక్కడ క్యూ అంటే క్వాంటమ్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ చాలా అరుదుగా ఉండే టైర్-2, టైర్-3 నగరాలను లక్ష్యంగా చేసుకుని బీఎస్ఎన్ఎల్ కొత్త క్యూ-5జీ ఎఫ్డబ్ల్యూఏ సేవలను ప్రారంభించింది. భారతదేశంలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బీఎస్ఎన్ఎల్ రూపొందించిన ఈ సరికొత్త సర్వీస్ వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, నెట్వర్క్ లేని నివాస ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడంలో సహాయపడుతుంది.

అయితే, ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా అందించే సాధారణ 5జీ సేవల మాదిరిగా కాకుండా బీఎస్ఎన్ఎల్ క్యూ -5జీ ఎఫ్డబ్ల్యూఏలో వాయిస్ సదుపాయం ఉండదు. అంటే దీని ద్వారా వినియోగదారులు కాల్స్ చేయలేరు. సిమ్ లేదా వైర్లు లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ మాదిరిగానే ఇది ఉంటుంది.
క్యూ-5జీ ప్లాన్లు
మిగిలిన వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసుల మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ క్యూ -5జీ తీసుకున్న కస్టమర్లకు వారి ఇళ్లపై సీపీఈ పరికరాలను ఏర్పాటు చేస్తారు. బీఎస్ఎన్ఎల్ కొత్త క్యూ-5జీ సర్వీస్ 100 ఎంబీపీఎస్ కనీస వేగాన్ని అందిస్తుంది. ఇందుకోసం నెలకు రూ .999 ఖర్చు అవుతుంది. అదే 300 ఎంబీపీఎస్ వేగం కావాలంటే రూ.1,499 ప్లాన్ ను అందిస్తోంది.
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ క్యూ-5జీ ఎఫ్డబ్ల్యూఏ హైదరాబాద్కే పరిమితం కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బెంగళూరు, పాండిచ్చేరి, విశాఖపట్నం, పుణె, గ్వాలియర్, చండీగఢ్ వంటి నగరాలకు ఈ సేవలను విస్తరించాలని యోచిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తెలిపింది.