రైట్స్‌ ఇష్యూ బాటలో ఐవోసీ | BPCL, Indian Oil announces rights issue | Sakshi
Sakshi News home page

రైట్స్‌ ఇష్యూ బాటలో ఐవోసీ

Jul 6 2023 6:38 AM | Updated on Jul 6 2023 6:38 AM

BPCL, Indian Oil announces rights issue - Sakshi

న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు రైట్స్‌ ఇష్యూ బాటలో సాగుతున్నాయి. ఇటీవలే భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌) ఇందుకు బోర్డు అనుమతిని సాధించగా.. నంబర్‌ వన్‌ చమురు కంపెనీ ఐవోసీ ఇందుకు తెరతీయనుంది. రైట్స్‌ ఇష్యూ చేపట్టే ప్రతిపాదనపై బోర్డు ఈ నెల 7న సమావేశంకానున్నట్లు బీపీసీఎల్‌ తాజాగా పేర్కొంది. వెరసి రెండు సంస్థలూ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా తాజా పెట్టుబడులను సమకూర్చుకోనున్నాయి. కర్బన ఉద్గారరహిత ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చమురు పీఎస్‌యూలకు పెట్టుబడులు అందించే ప్రణాళికల్లో ఉన్న నేపథ్యంలో రైట్స్‌ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా.. రైట్స్‌ జారీ ద్వారా వివిధ ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయాలకు నిధులు సమకూర్చుకోనున్నట్లు ఐవోసీ పేర్కొంది. వెరసి కంపెనీలో ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వం సైతం రైట్స్‌కు సబ్‌స్క్రయిబ్‌ చేయడం ద్వారా పెట్టుబడులు సమకూర్చనుంది.  

రూ. 18,000 కోట్లకు సై
పీఎస్‌యూ దిగ్గజం బీపీసీఎల్‌ బోర్డు గత నెల(జూన్‌) 28న రైట్స్‌ ఇష్యూకి అనుమతించింది. తద్వారా కంపెనీ రూ. 18,000 కోట్లు సమీకరించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో ఇంధన రంగ పీఎస్‌యూలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌లకు మొత్తం రూ. 30,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకునేందుకు ప్రతిపాదించింది. తద్వారా కర్బన ఉద్గార రహిత సన్నాహాలకు మద్దతిచ్చేందుకు నిర్ణయించింది. ఇక ఓఎన్‌జీసీకి మెజారిటీ వాటా గల మరో పీఎస్‌యూ హెచ్‌పీసీఎల్‌ ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ ద్వారా పెట్టుబడులు సమకూర్చుకునే వ్యూహాల్లో ఉంది. గత నెలలో ఐవోసీ అధీకృత వాటా మూలధనాన్ని రెట్టింపునకు అంటే రూ. 30,000 కోట్లకు పెంచుకున్న సంగతి తెలిసిందే.  
ఈ వార్తల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.8 శాతం బలపడి రూ. 95.40 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement