రూ. 45 నుంచి రూ. 75కి పెంచిన బీఐఎస్
ముంబై: పండుగల వేళ బంగారం ఆర్టికల్స్ స్వచ్ఛతను ధ్రవీకరించే హాల్మార్కింగ్ చార్జీలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సవరించింది. రూ. 45 నుంచి రూ. 75కి పెంచింది. వెండికి సంబంధించిన చార్జీలను మాత్రం యథాతథంగా రూ. 35గానే ఉంచింది. ఈ మార్పులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు బీఐఎస్ (హాల్మార్కింగ్) నిబంధనలను సవరించింది. ఇందులోని షెడ్యూల్ 4 కింద జ్యుయలర్లు ఒక్కో ఆర్టీకల్కి రూ. 75 చొప్పున, గుర్తింపు పొందిన అసేయింగ్–హాల్మార్కింగ్ సెంటర్లకు (ఏహెచ్సీ) హాల్మార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
బంగారు ఆర్టీకల్స్కయితే ఒక్కో కన్సైన్మెంట్ బ్యాచ్కి రూ. 200, వెండి ఆర్టీకల్స్కి కనీసం రూ. 150గా ఉంటుంది. అయితే, అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి (జీజేసీ) చార్జీల పెంపుపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా 67% మేర ఎందుకు పెంచాల్సి వచి్చందనేది పరిశ్రమకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల నేపథ్యంలో తక్షణమే పెంపు నిర్ణయాన్ని సమీక్షించి, ప్రస్తుత చార్జీలనే కొనసాగించాలని జీజేసీ చైర్మన్ రాజేశ్ రోక్డే తెలిపారు.


