
దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జనవరిలో స్వల్పంగా పెరిగి 119 కోట్లకు చేరింది. వైర్లైన్, మొబైల్ సెగ్మెంట్లలో కొత్త సబ్స్క్రయిబర్స్ను దక్కించుకోవడంలో ఎయిర్టెల్ అగ్రస్థానంలో నిల్చింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
వీటి ప్రకారం గతేడాది డిసెంబర్లో 118.99 కోట్లుగా ఉన్న టెలికాం సబ్స్క్రయిబర్స్ సంఖ్య జనవరిలో 119.20 కోట్లకు పెరిగింది. మొబైల్, వైర్లైన్ సెగ్మెంట్లో ఎయిర్టెల్ యూజర్లు వరుసగా 16.53 లక్షలు, 1.17 లక్షల మేర పెరిగారు. 5జీ ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ను వైర్లెస్ సర్వీసుగా ట్రాయ్ వర్గీకరించింది. ప్రస్తుతం ఈ విభాగంలో 48.44 లక్షల యూజర్లతో రిలయన్స్ జియో అగ్రస్థానంలో, 8.72 లక్షల సబ్స్క్రయిబర్స్తో ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉన్నాయి.
మరిన్ని ముఖ్యంశాలు..
» మొబైల్ సెగ్మెంట్లో జియో 46.5 కోట్ల యూజర్లతో నంబర్వన్గా, 38.69 కోట్ల మందితో ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా 13 లక్షల కనెక్షన్లను, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 3.69 లక్షలు, ఎంటీఎన్ఎల్ 2,617 మంది కస్టమర్లను కోల్పోయాయి.
» వైర్లైన్ విభాగంలో బీఎస్ఎన్ఎల్ 39,953, ఎంటీఎన్ఎల్ 9,904, క్వాడ్రాంట్ 4,741, వొడాఫోన్ ఐడియా 3,447 మంది కస్టమర్లను పోగొట్టుకున్నాయి.
» జియో, ఎయిర్టెల్ నిర్దేశిత ఫార్మాట్లో డిసెంబర్, జనవరి డేటాను సమర్పించకపోవడంతో ట్రాయ్ బ్రాడ్బ్యాండ్ యూజర్ల వివరాలను అప్డేట్ చేయలేదు.