Apple: భారత తొలి ఆపిల్‌ స్టోర్‌పై కోవిడ్‌-19 దెబ్బ..!

Apple India Physical Store Launch Delayed - Sakshi

ఆపిల్‌ కంపెనీకి చెందిన ఐఫోన్‌కు క్రేజ్‌ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్‌ ఫోన్లతో పోలిస్తే ఆపిల్‌ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్‌ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. భారత మార్కెట్లలో ఆపిల్‌ స్మార్ట్‌ఫోన్లకు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. భారత మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ఆపిల్‌ అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్‌ను 2020 సెప్టెంబర్‌ నెలలో ప్రారంభించింది.

ఆపిల్‌ తన తొలి  అధికారిక ఫిజికల్‌ రిటైల్‌ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 రాకతో భారత్‌లో ఫిజికల్‌ రిటైల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేయడంలో నీలినీడలు కమ్ముకున్నాయి. ఆపిల్‌ తొలి ఫిజికల్‌ రిటైల్‌ స్టోర్ ఏర్పాటు ఆలస్యమయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ గత ఏడాది 2021 నుంచి భారత్‌లో ఆపిల్‌ తన తొలి ఫిజికల్‌స్టోర్‌ను తెరవనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా భారత రిటైల్‌ రంగంలో ఆపిల్‌ తన స్థానిక ఉనికిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఆపిల్‌ తన పరికరాలను ప్రాంచైజ్‌ రిటైల్‌ నెట్‌వర్క్‌ కింద పనిచేసే పంపిణీదారుల ద్వారా దేశంలో విక్రయిస్తోంది. ఆప్‌ట్రాన్సిక్స్‌ వంటి ఫ్రాంచైజ్‌లతో ఆపిల్‌ తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆపిల్‌ రెండంకెల వృద్ధితో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదుచేసింది. ఆపిల్‌ టర్నోవర్‌ 36 శాతం అధికమై రూ.6,05,616 కోట్లు సాధించినట్టు సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌ వెల్లడించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4.43 లక్షల కోట్లుగా ఉంది. నికరలాభం రూ.83,328 కోట్ల నుంచి రూ.1,61,448 కోట్లకు చేరింది. ఏ దేశం నుంచి ఎంత మొత్తం ఆదాయం సమకూరింది వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top