మెగ్నీషియం సల్ఫేట్తో ఘాతుకం
తెలంగాణలోని పలు జిల్లాల్లో వీధికుక్కల పట్ల అత్యంత క్రూరమైన చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. జంతు సంక్షేమ నిబంధనలను తుంగలో తొక్కి మెగ్నీషియం సల్ఫేట్ వంటి రసాయనాలను ఉపయోగించి కుక్కలను సామూహికంగా హతమారుస్తున్నట్లు జంతు పరిరక్షణ కార్యకర్తలు, పశువైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విషప్రయోగం - అత్యంత బాధాకరమైన మరణం
సాధారణంగా వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే మెగ్నీషియం సల్ఫేట్ మార్కెట్లో తక్కువ ధరకు సులభంగా లభిస్తుంది. దీన్ని ద్రవ రూపంలోకి మార్చి నిపుణుల ద్వారా కుక్కల గుండెకు నేరుగా ఇంజెక్ట్ చేస్తున్నారని సమాచారం. ‘ఇది చాలా పాత, క్రూరమైన పద్ధతి. మెగ్నీషియం సల్ఫేట్ను నేరుగా గుండెకు ఇంజెక్ట్ చేయడం వల్ల జంతువులకు తక్షణమే అత్యంత బాధాకరమైన మరణం సంభవిస్తుంది. ఇది సాధారణ వ్యక్తులు చేసే పని కాదు, శిక్షణ పొందిన వారే ఇలా చేస్తున్నారు’ అని ఒక సీనియర్ పశువైద్యుడు వెల్లడించారు.
విచ్చలవిడిగా రసాయనాల వాడకం
కుక్కలను చంపడానికి కేవలం మెగ్నీషియం సల్ఫేట్ మాత్రమే కాకుండా ‘స్ట్రిక్నైన్ హైడ్రోక్లోరైడ్’ వంటి ప్రమాదకర రసాయనాలను కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం 5 గ్రాముల స్ట్రిక్నైన్ హైడ్రోక్లోరైడ్ పొడితో వందలాది కుక్కలను చంపవచ్చు. దీన్ని మాంసంలో కలిపి ఎరగా వేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు సైనైడ్ ఉపయోగించి కూడా కుక్కలను చంపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ‘కొంగ మందు’ అని పిలిచే సాంప్రదాయ మందులను కూడా ఆహారంలో కలిపి ఇచ్చి కుక్కల ప్రాణాలు తీస్తున్నారు.
చట్టం ఏం చెబుతోంది?
భారత జంతు సంక్షేమ బోర్డు (AWBI) నిబంధనల ప్రకారం, వీధికుక్కలను చంపడం నేరం. కేవలం నయం చేయలేని వ్యాధులు ఉన్నప్పుడు లేదా ప్రాణాంతక గాయాలైనప్పుడు మాత్రమే శాంతియుత మరణానికి ప్రత్యేక పద్ధతులు అనుసరించాలి. ఇందుకోసం ప్రభుత్వం, జంతు సంక్షేమ బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాయి.
దీని ప్రకారం, ప్రాణాంతక వ్యాధులు లేదా తీవ్రమైన గాయాలతో బాధపడుతున్న కుక్కలకు మాత్రమే అనుమతుల మేరకు పెంటనాల్ సోడియం, సోడియం థియోపెన్టోన్ వంటి మందులను ఉపయోగించి శాంతియుత మరణం ప్రసాదించాలి. అయితే, ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా మెగ్నీషియం సల్ఫేట్, సైనైడ్, స్ట్రిక్నైన్ హైడ్రోక్లోరైడ్ వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి కుక్కలను అక్రమంగా హతమారుస్తున్నారు.
సులభంగా అందుబాటులో..
ఈ మందుల లభ్యత విషయంలో కూడా చాలా అనుమానాలున్నాయి. పెంటనాల్ సోడియం వంటి మందులు కేవలం అధికారిక ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే లభిస్తాయి. వీటి వినియోగంపై కఠినమైన నిఘా ఉంటుంది. దీనికి భిన్నంగా కుక్కలను చంపడానికి వాడుతున్న ఇతర రసాయనాలు సాధారణ రిటైల్ దుకాణాల్లో ఎటువంటి పరిమితులు లేకుండా ఎవరికైనా సులభంగా దొరుకుతున్నాయి. ఇది అసాంఘిక శక్తులకు, నిబంధనలు ఉల్లంఘించే వారికి వరంగా మారింది.
నిబంధనల ప్రకారం, ఏదైనా జంతువుకు ప్రాణాపాయ స్థితిలో మందు ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా అర్హత కలిగిన వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నిపుణులు కాని వారిని నియమించి ఎటువంటి వైద్య పర్యవేక్షణ లేకుండా సామూహికంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం. ఇలాంటి అక్రమ పద్ధతులు జంతు హింసను ప్రోత్సహించడమే కాకుండా చట్టంలోని నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లేనని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విష రసాయనాల విక్రయాలపై నియంత్రణ విధించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!


