ఏఐ దారి తప్పకుండా థియోమ్‌ పటిష్ట నిఘా! | AI Under Siege Theom Expands Hyderabad to Guard Data Reinvent Security | Sakshi
Sakshi News home page

ఏఐ దారి తప్పకుండా థియోమ్‌ పటిష్ట నిఘా!

Jun 12 2026 11:46 AM | Updated on Jun 12 2026 11:51 AM

AI Under Siege Theom Expands Hyderabad to Guard Data Reinvent Security

హైదరాబాద్‌లో కొత్త కార్యాలయం ఏర్పాటు

‘‘ఏఐ కట్టుతప్పుతోంది.. తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకునేంత వరకూ వాడకం ఆపేద్దాం’’. ఆంథ్రోపిక్‌ సీఈవో ఇటీవల చేసిన హెచ్చరిక ఇది. అయితే ఇంకో అంతర్జాతీయ ఏఐ సంస్థ థియోమ్‌ మాత్రం ఇందుకు భిన్నమైన ఆలోచన చేస్తోంది. హ్యాకర్లు ఏఐ దుర్వినియోగానికి ప్రయత్నిస్తూంటే... తాము ఏఐ సాయంతోనే ఏఐకు, డేటాకు రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని థియోమ్‌ చెబుతోంది. ఇదే అంశంపై సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈవో నవీంద్ర యాదవ్‌ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే...

ప్రశ్న: ముందుగా థియోమ్‌ గురించి వివరించండి.

జవాబు: థియోమ్‌ డేటా, ఏఐ సెక్యూరిటీ కంపెని. 2020 డిసెంబరులో స్థాపించాము. మిగిలిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థల మాదిరిగా ఇది డేటాను నెట్‌వర్క్‌ల బయట నుంచి కాపాడదు. లోపలి నుంచి రక్షణ కల్పిస్తుంది. స్నోఫ్లేక్స్‌, డేటాబ్రిక్స్‌ వంటి భారీ డేటా స్టోర్లు, గోల్డ్‌మ్యాన్ శాక్స్‌, బ్లాక్‌రాక్‌ వంటి ఫైనాన్షియల్‌ సంస్థలు, హెల్త్‌కేర్‌, ఫార్మా కంపెనీలు ఈ డేటా స్టోర్లను వాడుకుంటూంటాయి. థియోమ్‌ ఈ డేటా స్టోర్లతోపాటు కంపెనీలు వాడే ఏఐ వ్యవస్థల్లో ఉంటూ రక్షణ కల్పిస్తుంది. ఏఐ సాఫ్ట్‌వేర్‌పై ఎవరైనా దాడులు చేస్తున్నారా? అన్నది పరిశీలించడంతోపాటు, ఏఐ డేటాతో జరిపే సంప్రదింపులను కూడా పరిశీలించి అవాంఛనీయ ఘటనలేవీ జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏఐ ఏ రకమైన డేటాతో పనిచేస్తోందన్నది నిత్యం గమనిస్తూండటం ద్వారా అది దారి తప్పకుండా కాపు కాస్తూ ఉంటుందన్నమాట.

ప్ర: మీరు డేటా స్టోర్ల గురించి ప్రస్తావించారు. ఇవి డేటా సెంటర్లూ ఒకటేనా?

జ: కాదు. రెండూ వేర్వేరు. డేటా సెంటర్లలో డేటా నిక్షిప్తమవుతుంది. కంప్యూటర్లు, సర్వర్లు ఉండే ప్రాంతం. డేటా స్టోర్లు అంటే ఈ డేటా సెంటర్లలోని సమాచారం. ఇంకోలా చెప్పాలంటే ఒక రకమైన డేటాబేస్‌ అన్నమాట.

ప్ర: ఏఐ వ్యవస్థలకు ప్రస్తుతం ఎలాంటి ముప్పు ఎదురవుతోంది?

జ: చాలానే ఉన్నాయి. ఏఐ వ్యవస్థలను తమ అవసరాల కోసం వాడుకునేందుకు నిత్యం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. డేటా చోరీతోపాటు, సమాచారాన్ని తమకు అనుకూలమైన రీతిలో మార్చుకుని లాభపడేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఆంథ్రోపిక్‌ గురించి మీరు వినే ఉంటారు. ఇటీవలే ఈ ఏఐ కంపెనీ మైథోస్‌ పేరుతో సరికొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెండు వారాల క్రితమే భారత ప్రభుత్వం కూడా దీన్ని వాడటం మొదలుపెట్టింది. మైథోస్‌ అనేది ఇతర వ్యవస్థలపై దాడి చేయగల సామర్థ్యమున్నది. థియోమ్‌ ఇలాంటి దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

సింపుల్‌గా చెప్పాలంటే థియోమ్‌ అనేది శరీర రోగ నిరోధక వ్యవస్థ లాంటిది. లోపలి నుంచి రక్షణ కల్పిస్తుంది. మిగిలిన సైబర్‌ సెక్యూరిటీ సం‍స్థలు తొడుక్కునే రక్షణ కవచల్లాంటివి. అందుకే థియోమ్‌ అనేది ఏఐ యుగం కోసం సిద్ధం చేసిన వ్యవస్థ.

ప్ర: ఆరేళ్లలో థియోమ్‌ ఎంత మేర విస్తరించింది?

జ: థియోమ్‌ ఒక అంతర్జాతీయ సంస్థ. అమెరికాలో మొదలైంది. భారత్‌తోపాటు జర్మనీ, పోర్చుగల్‌, క్రొయేషియా, ఆస్ట్రేలియాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పశ్చిమార్ధగోళం నుంచి అత్యధిక ఆదాయం పొందుతున్న కంపెనీ. జెట్‌ బ్లూ ఎయిర్‌లైన్స్‌, ఫార్మాస్యూటికల్‌, హెల్త్‌కేర్‌ కంపెనీలు, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్, బ్లాక్‌రాక్‌ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు, పలు ఏఐ ఫస్ట్‌ కంపెనీలు థియోమ్‌ సాయంతో తమ డేటా, ఏఐలు రెండింటినీ రక్షించుకుంటున్నాయి. స్టారప్‌ కంపెనీనే గానీ వేగంగా వృద్ధి చెందుతోంది.

ప్ర: హైదరాబాద్‌ కేంద్రం నుంచి ఎలాంటి ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నారు?

జ: థియోమ్‌కు హైదరాబాద్‌ బ్యాక్‌ ఆఫీసు కానేకాదు. అంతర్జాతీయ కస్టమర్లకు సరికొత్త ప్రాడక్ట్స్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఇప్పటివరకూ యాభై మంది ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌లో ఏఐని మరింత సమర్థంగా వాడటం ఎలా అన్నది ఇక్కడే అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం.

ప్ర: ఆంథ్రోపిక్‌ లాంటి సంస్థలు కోడింగ్‌లో ఏఐ వాడకాన్ని తగ్గించాలని చెబుతూంటే మీరు పెంచుతున్నారా?

జ: రెండింటికీ చాలా తేడా ఉంది. మేము ఏఐతోనే ఏఐని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆంథ్రోపిక్‌ వ్యవస్థలపై దాడులు చేసి, లోపాలను పసిగట్టి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. థియోమ్‌ దీనికి భిన్నంగా ఏఐని అస్సలు నమ్మకుండా, తగిన రక్షణ ఏర్పాట్లతో సాఫ్ట్‌వేర్‌ ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో మానవ పర్యవేక్షణ ఎక్కువన్నమాట.

ప్ర: ఏఐ రంగంలో ఉన్నారు కాబట్టి... జనరల్‌ ఇంటెలిజెన్స్‌ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందని మీ అంచనా?

జ: చెప్పడం కష్టం. కాకపోతే ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అన్నది ఏదో ఒక దశలో అందుబాటులోకి వస్తుందని చెప్పవచ్చు కానీ.. ఇన్నేళ్లు, ఇన్ని నెలలు అని చెప్పలేము.

ప్ర: ఏఐతో ఉద్యోగాలు పోతాయంటున్నారు. మీ అంచనా ఏమిటి?

జ: నా ఉద్దేశం ప్రకారం ఉద్యోగాల నిర్వచనం మారిపోతుంది అంతే. ఇంటర్నెట్‌, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో చాలా ఉద్యోగాలు పోతాయని అనేవారు. కానీ కొత్త రకాల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు ఏఐ స్థానంలో మళ్లీ మానవ వనరులను వాడుకుంటున్నాయి. విషయాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏఐ వ్యవస్థలపై ఆధారపడటం వల్ల ఈ సమస్య వచ్చింది.

హైదరాబాద్‌లో థియోమ్‌ కొత్త కార్యాలయం

డేటా, కృత్రిమ మేధ రక్షణ రంగంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా దూసుకుపోతున్న థియోమ్‌ సంస్థ భారతదేశంలో తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని తాజాగా ప్రారంభించింది. థియోమ్‌ తన అంతర్జాతీయ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు, కొత్త ఆవిష్కరణలను రూపకల్పన చేసేందుకు ఈ ఫెసిలిటీ దోహదపడనుందని చెప్పింది.

భారతదేశపు ప్రముఖ సాంకేతిక హబ్‌ల్లో ఒకటైన హైదరాబాద్ కేంద్రంగా.. ఇంజినీరింగ్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ఆపరేషనల్ ఎక్సలెన్స్ రంగాల్లో థియోమ్‌ కీలక అడుగులు వేయనుంది. ఇక్కడి టెక్నాలజీ ప్రతిభను ఉపయోగించుకుంటూ తమ ఉత్పత్తుల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని సంస్థ భావిస్తోంది. ఈ త్రైమాసికం ముగిసే నాటికి హైదరాబాద్ కేంద్రంలో 50 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని థియోమ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. డేటా సెక్యూరిటీ, క్లౌడ్ ప్రొటెక్షన్, ఏఐ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ రక్షణ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలను తీసుకురావాలనే థియోమ్‌ దీర్ఘకాలిక ప్రపంచవ్యాప్త వ్యూహంలో భాగంగానే ఈ కేంద్రం రూపుదిద్దుకుంది.

ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో..

Advertisement
 
Advertisement
Advertisement