అత్యున్నత విద్యాసంస్థల్లో చదువు, ఏడాదికి రూ.1 కోటిపైనే వేతన ప్యాకేజీ, సొంతంగా మూడు ఇళ్లు.. ఇలా చూస్తే అతనో సంపన్నుడు. కానీ, ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) సమయానికి వచ్చేసరికి రూ.15,000 పన్ను చెల్లించడానికి కూడా అతని వద్ద నగదు లేకపోవడం గమనార్హం. చివరికి ఆ కొద్దిపాటి మొత్తాన్ని కూడా అప్పుగా తెచ్చి పన్ను చెల్లించిన ఉదంతం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అసలేం జరిగింది?
ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ప్రతిభా గోయల్ సోషల్ మీడియా వేదికగా ఈ ఆసక్తికర కథనాన్ని పంచుకున్నారు. గత ఐదేళ్లుగా రూ.1 కోటికి పైగా వార్షిక వేతనం పొందుతున్న ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ తన వద్దకు ఐటీఆర్ దాఖలు చేయడానికి వచ్చారని ఆమె తెలిపారు. అతని పేరిట మూడు ఇళ్లు ఉన్నాయని, అందులో రెండు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, రిటర్నులు దాఖలు చేసే సమయంలో మిగిలిన రూ.15,000 పన్ను బకాయి చెల్లించేందుకు కూడా అతని వద్ద నగదు అందుబాటులో లేదు. ‘ఆగస్టులో జీతం వచ్చేవరకు వేచి ఉండగలరా?’ అని ఆ క్లయింట్ అడిగినట్లు సీఏ వెల్లడించారు. గడువు దాటితే వడ్డీ భారం పెరుగుతుందని సూచించడంతో సదరు ఐటీ ఉద్యోగి వేరొకరి వద్ద అప్పుగా తీసుకువచ్చి పన్ను చెల్లించి ఐటీఆర్ పూర్తి చేశారు.
ఆస్తి ఉంది... నగదు లేదు!
ఈ సంఘటనపై గోయల్ స్పందిస్తూ.. దేశంలో ఆర్థిక అక్షరాస్యత ఎంత అవసరమో చెప్పడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. భారీ వేతనాలు పొందుతున్నప్పటికీ సంపాదన మొత్తాన్ని స్థిరాస్తుల్లో లేదా ఈఎంఐలలో లాక్ చేసి అత్యవసర నగదు లభ్యతను పక్కనబెట్టడం తీవ్రమైన నష్టాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
ఈ పోస్ట్ వైర్ కావడంపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమయ్యాయి. ‘క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే ఐఐటీయన్లు ప్రాథమిక ఆర్థిక సూత్రాలను మరిచిపోవడం ఆశ్చర్యంగా ఉంది’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఆస్తుల రూపంలో సంపద ఉన్నప్పటికీ నగదు లభ్యత లేకపోవడం (అస్సెట్ రిచ్, క్యాష్ పూర్) వల్లే జరిగింది’ అని మరొకరు విశ్లేషించారు. లిక్విడిటీ సంక్షోభం ఎదుర్కొనే వారిలో రూ.50 లక్షలకు పైగా ప్యాకేజీలు ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారని మరికొందరు సీఏలు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ!


