అంబుజా చేతికి పెన్నా సిమెంట్‌ | Adani Group Ambuja Cements to buy Penna Cement for Rs 10,422 crore | Sakshi
Sakshi News home page

అంబుజా చేతికి పెన్నా సిమెంట్‌

Jun 14 2024 3:17 AM | Updated on Jun 14 2024 8:12 AM

Adani Group Ambuja Cements to buy Penna Cement for Rs 10,422 crore

రూ.10,422 కోట్లకు కొనుగోలు చేసిన అదానీ గ్రూపు 

సాక్షి, అమరావతి/హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన పెన్నా సిమెంటును అంబుజా సిమెంట్‌ కొనుగోలు చేసింది. అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్,  పి. ప్రతాప్‌ రెడ్డి కుటుంబానికి చెందిన పెన్నా సిమెంట్‌ 100 శాతం వాటాను రూ.10,422 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియచేసింది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. 

సిమెంట్‌తో పాటు క్లింకర్, గ్రైండింగ్, ప్యాకేజింగ్, విద్యుత్‌ రంగాల్లో విస్తరించింది. ప్రస్తుతం పెన్నా సిమెంట్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌లో ఉన్న అయిదు సిమెంట్‌ యూనిట్లతో కలిపి ఏడాదికి 14 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెన్నా సిమెంట్‌ కొనుగోలుతో అదానీ గ్రూపు దేశవ్యాప్త సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి చేరింది.  

ఈ ఒప్పందం ద్వారా దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం రెండు శాతంగా ఉన్న మార్కెట్‌ వాటా 8 శాతానికి చేరుకుంటుందని, ఇదే సమయంలో శ్రీలంకలో పెన్నా సిమెంట్‌కు ఉన్న స్థానిక అనుబంధ కంపెనీ ద్వారా ఆ దేశంలో కూడా అడుగు పెట్టే అవకాశం కలుగుతుందని అదానీ గ్రూపు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ అనుమతులు అన్నీ పూర్తి చేసుకొని మూడు నుంచి 4 నెలల్లో ఈ అక్విజిషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని అంబుజా సిమెంట్‌ సీఈవో అజయ్‌ కపూర్‌ తెలిపారు. అలాగే పెన్నా సిమెంట్‌కు ఉన్న సున్నపురాయి గనులు కూడా అదానీ గ్రూపునకు కలిసి వస్తాయన్నారు.

తాడిపత్రితో ప్రారంభం
పి.ప్రతాప్‌ రెడ్డి కుటుంబం 1994లో అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద తలారి చెరువులో ఏడాదికి 0.2 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో తొలి సిమెంట్‌ ప్లాంటును ఏర్పాటు చేసి వేగంగా విస్తరించింది. ప్రస్తుతం తాడిపత్రి యూనిట్‌ సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం 1.8 మిలియన్‌ టన్నులకు చేరడమే కాకుండా అక్కడ 1.3 మిలియన్‌ టన్నుల క్లింకర్‌ యూనిట్‌నుకూడా ఏర్పాటు చేశారు. అదే జిల్లా  బోయరెడ్డి పల్లి వద్ద మరో రెండు మిలియన్‌ టన్నుల సిమెంట్, 4 మిలియన్‌ టన్నుల క్లింకర్, 25 మెగావాట్ల వేస్ట్‌ హీట్‌ రికవరీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.

 తెలంగాణ రాష్ట్రంలో తాండూరు వద్ద రెండు మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ప్లాంటు, 1.5 మిలియన్‌ టన్నుల క్లింకర్, నల్గొండ జిల్లా గణే‹Ùపహడ్‌ వద్ద 1.2 ఎంటీ సిమెంట్,  1 ఎంటీ క్లింకర్, 7 డబ్ల్యూహెచ్‌ వేస్ట్‌ హీట్‌ రికవరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాజస్థాన్‌లో జోథ్‌పూర్‌లో నిర్మిస్తున్న 2 ఎంటీ, కృష్ణపట్నం వద్ద నిర్మిస్తున్న మరో 2 ఎంటీ యూనిట్లు మరో ఆరు నుంచి ఏడాదిలోగా అందుబాటులోకి రానున్నాయి.  నల్గొండ జిల్లా గణేష్‌ పçహాడ్‌ వద్ద 77 మెగావాట్ల విద్యుత్‌ యూనిట్‌ను పెన్నా సిమెంట్‌ కలిగి ఉంది. ఈ ఒప్పందంతో కోల్‌కతా, గోపాల్‌పూర్, కరైకల్, కొచ్చి, కొలంబోలోని బల్క్‌ సిమెంట్‌ టెరి్మనల్స్‌ ద్వారా అదానీ సీ ట్రాన్స్‌పోర్టేషన్‌ లాజిస్టిక్‌ సామర్థ్యం పెరుగుతుందని కపూర్‌ చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement