పండుగలు అందరినీ కలుపుకునిపోయే సందర్భాలు
వాటిలో ముస్లింలు పాల్గొనడంలో తప్పేంలేదు
సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత వ్యాఖ్యలు
ముంబై: పండుగలంటే అందరినీ కలుపుకొనిపోయే సందర్భాలని తాను నమ్ముతానని, వాటిలో ముస్లింలు కూడా పాల్గొని ఆస్వాదించడంలో తప్పేమీ లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ అన్నారు. భద్రతా తనిఖీల్లో మతపరమైన వివక్షకు దావుండరాదని స్పష్టం చేశారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించే దాండియా, గర్భా వంటి వేదికల్లోకి ముస్లింలను అనుమతించకూడదన్న వీహెచ్పీ (VHP) పిలుపు, వాటికి బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే మద్దతు నేపథ్యంలో ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నవరాత్రి ‘గర్బా’, ‘దాండియా’ కార్యక్రమాల్లో పాల్గొనే వారి ఆధార్ కార్డులను తనిఖీ చేయడం, నుదుటిపై ‘తిలకం’ పెట్టడం ద్వారా వారి గుర్తింపును ధృవీకరించుకోవాలని గతవారం విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) నిర్వాహకులకు మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిని సమర్థిస్తూ నితేష్ రాణే ఇలాంటి పండుగల సమయంలో ‘లవ్ జిహాద్’ కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోపించారు. అందుకే ముందస్తు తనిఖీలతో పాటు హనుమాన్ చాలీసా పఠనాన్ని కూడా తప్పనిసరి చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో గుర్తింపు కార్డులను పరిశీలించండి, మతాన్ని కాదంటూ అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. నవరాత్రి వేడుకల్లో కుల, మత భేదాలు ఉండకూడదని ఆమె పేర్కొన్నారు.
ముందు సీఎంకు చెప్పండి: సంజయ్ రౌత్
హిందూ పండుగల్లో ముస్లింలు పాల్గొనడం తప్పేమీ కాదన్న అమృత ఫడ్నవీస్ అభిప్రాయాన్ని శివసేన (యూబీటీ) ఎంపీ నాయకుడు సంజయ్ రౌత్ సమర్థించారు. ‘గర్భాలో ముస్లిం మహిళలను పాల్గొనడానికి అనుమతించాలన్న అమృత ఫడ్నవీస్ వైఖరిని నేను స్వాగతిస్తున్నా. అయితే ముందుగా ముఖ్యమంత్రికి, ఆయన మంత్రివర్గంలోని నియో–హిందుత్వవాదులకు ఈ విషయంపై ఆమె సలహా ఇవ్వాలి. ఐక్య మహారాష్ట్ర కోసం పోరాటం అయినా, స్వాతంత్య్రం కోసం అయినా, వివిధ పోరాటాలకు ముస్లిం సమాజం ప్రధాన సహకారం అందించిందని వారు గుర్తుంచుకోవాలి’ అని రౌత్ సూచించారు. మహారాష్ట్ర ఏర్పాటు కోసం కవి అమర్ షేక్తో సహా చాలా మంది త్యాగాలు చేశారని గుర్తుచేశారు.
ఇదీ చదవండి: మిరాకిల్.. బస్సులో పడి బతికిపోయాడు!


