కొత్తగూడెంఅర్బన్: ప్రజలకు ఆధార్ సేవలు మరింత చేరువ చేస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఆధార్ సేవల కోసం జిల్లా ప్రజలు హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్తగూడెంలోనే కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుని నిర్ణీత సమయంలో ఆధార్ సేవా కేంద్రానికి రావొచ్చని చెప్పారు. రాష్ట్ర యూఐడీఏఐ రీజినల్ కార్యాలయ మేనేజర్ నరేష్ చంద్ర, బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ రీజినల్ మేనేజర్ శ్రీనివాస్, కొత్తగూడెం ఆధార్ సేవా కేంద్రం ఆపరేషనల్ మేనేజర్ వంశీ, కొత్తగూడెం తహసీల్దార్ పుల్ల య్య, ఈ–జిల్లా మేనేజర్ సైదేశ్వరరావు, టీఎస్టీఎస్ జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): భూ సేకరణ పనులు, సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం రాత్రి అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి తహసీల్దార్లు, ఇరిగేషన్, సంబంధిత సెక్షన్ అధికారులు, సర్వేయర్లలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, పులుసుబొంత ప్రాజెక్టులు, బీటీపీఎస్ల భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. భూభారతి రీ సర్వే, సాదా బైనామా, రెవెన్యూ సదస్సులు పూర్తి చేయాలని చెప్పారు. భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.
కలెక్టర్ అంకిత్


