కొత్తగూడెంఅర్బన్: ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పోస్టర్ మేకింగ్ పోటీల్లో జిల్లా విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది. ములకలపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎస్.ధనలక్ష్మి పోటీల్లో ప్రతిభ చాటింది. ఈ మేరకు డీఈఓ డి.వాసంతి శుక్రవారం వివరాలు వెల్లడించారు. విద్యార్థినిని, ఉపాధ్యాయులను ఆమె అభినందించారు.
49 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 27 మంది ప్రధానోపాధ్యాయులు, 22 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆగస్టులో విద్యార్థుల హాజరు 50 శాతం కన్నా తక్కువగా నమోదైన పాఠశాలల హెచ్ఎంలు, పాఠశాలలకు ఆలస్యంగా హాజరైన 22 మంది ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారు.
హైకోర్టు తీర్పుతో
పేదలకు ఊరట
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని గాంధీనగర్, బుడిదగడ్డ ప్రాంతాల పేదలకు హైకోర్టు తీర్పుతో ఊరట లభించింది. 1999 సంవత్సరంలో 142, 143 సర్వే నంబర్లలో ఒక్కొక్కరికి 110 గజాల చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. దీంతో వారు నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. 2004లో ఇళ్లను తొలగించగా బాధితులు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాల విచారణ అనంతరం గత నెల 25న హైకోర్టు తీర్పు వెలువరించింది. శాంతియుత స్వాధీనం, అనుభవంలో జోక్యం చేసుకోవొద్దని తీర్పులో పేర్కొంది. భవిష్యత్తులో ఏదైనా అధికారిక చర్య అవసరమైతే చట్టప్రకారం, తగిన విధానాన్ని అనుసరించాలని సూచించింది. దీంతో ఇళ్ల స్థలం కోల్పోయినవారికి న్యాయం జరగనుంది. తీర్పు కాపీలను న్యాయవాది మారపాక రమేష్కుమార్ రెండు రోజుల క్రితం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు, కొత్తగూడెం తహసీల్దార్కు, డీఎస్పీకి, వన్టౌన్ సీఐకి, త్రీటౌన్ సీఐకి అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ నాయకుడు నయీంఖురేషి శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.


