● విశేష సేవలందిస్తున్న నవజాత శిశు సంరక్షణ కేంద్రం ● భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 14 ఏళ్ల క్రితం ఏర్పాటు ● ఇప్పటివరకు 22,919 మంది శిశువులకు మెరుగైన చికిత్స
భద్రాచలంఅర్బన్: బిడ్డ పుట్టగానే ఆనందం.. ఆ శిశువు అనారోగ్యంగా ఉందనే వేదన నడుమ తల్లిడిల్లిపోయే తల్లిదండ్రులకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రం(ఎస్ఎన్సీయూ) మనోధైర్యాన్ని కల్పిస్తోంది. ఎస్ఎన్సీయూ భద్రాచలం ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాలకు వరంగా మారింది. ఈ కేంద్రం 2012 ఆగస్టు 8న ప్రారంభంకాగా, 14 ఏళ్లలో 22,919 మంది నవజాత శిశువులకు సేవలందించారు.
● 2014–2025 మధ్య 18,277 మంది చిన్నారులు చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా, 2026 జూలై వరకు మరో 663 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా 18,940 మంది చిన్నారులు చికిత్స అనంతరం కుటుంబాల ఒడికి చేరారు.
● ఈ ఏడాది జనవరిలో 111 మంది, ఫిబ్రవరిలో 79, మార్చిలో 97, ఏప్రిల్లో 122, మేలో 116, జూనన్లో 107, జూలైలో 93 మంది చిన్నారులు అడ్మిట్ కాగా, ఏడు నెలల్లో 725 మంది శిశువులకు సేవలందాయి.
● వీరిలో 486 మంది ఇన్బోర్న్, 239 మంది అవుట్బోర్న్ శిశువులు ఉన్నారు. వీరిలో 663 మంది డిశ్చార్జి కాగా, 30 మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న 21 మందిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేశారు.
● ఏరియా ఆస్పత్రిలో జన్మించిన శిశువులతోపాటు ఇతర ఆస్పత్రులు, మారుమూల ప్రాంతాల నుంచి కూడా అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులను ఇక్కడికి తీసుకొస్తున్నారు. 2014–2025 మధ్య 15,232 మంది ఇన్బోర్న్, 6,962 మంది అవుట్బోర్న్ శిశువులు చికిత్స పొందారు.
20 పడకలతో ప్రత్యేక సంరక్షణ
తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, పుట్టిన వెంటనే ప్రత్యేక పర్యవేక్షణ అవసరమైన చిన్నారులకు ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. అత్యవసర సమయంలో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుండటంతో ప్రయాణ సమయం, ఆర్థిక భారం కూడా తగ్గుతోంది. ఎస్ఎన్సీయూ 10 పడకలతో ప్రారంభించగా, ప్రస్తుతం 20 పడకలకు విస్తరించారు.
క్లిష్ట పరిస్థితుల్లో రిఫరల్..
స్థానికంగానే చికిత్స అందించడం సాధ్యం కాని పరిస్థితుల్లో మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. 2014–2025 మధ్య 894 మంది, 2026 జూలై వరకు మరో 21 మంది.. మొత్తంగా 915 మంది చిన్నారులను తదుపరి వైద్యం కోసం రిఫర్ చేశారు. ఇదే సమయంలో 2014–2025 మధ్య 1,399 మంది, 2026 జూలై వరకు 30 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. కాగా, ఎస్ఎన్సీయూలో కై లాస్మోహన్ సేవలు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. నవజాత శిశువుల సంరక్షణపై ఆయన చూపిన శ్రద్ధ, సేవాభావం ఎంతోమంది కుటుంబాలకు ధైర్యాన్నిచ్చాయి.


