ఎవరికి వారే..
నువ్వా నేనా?
● అభివృద్ధిలో వెనుకబడుతున్న జిల్లా ● పవర్ చూపించలేకపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ● పరిస్థితి చేయిదాటకముందే దిద్దుబాటు జరిగేనా?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా నుంచి కేబినెట్ బెర్త్ దక్కకపోవడంతో ఇటు ప్రభుత్వం అటు పార్టీ పరంగా బలమైన నేత కరువయ్యారు. ఫలితంగా జిల్లాలోని ఐదు నియోజకర్గాల్లో ఆశించిన వేగంతో పనులు ముందుకు సాగడం లేదు. దీని తాలుకూ ప్రతికూల ఫలితాలుక్రమంగా కాంగ్రెస్పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
కనిపించని పాయం మార్క్
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాయం వెంకటేశ్వర్లు జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేల్లో సీనియర్ ఇసుక లారీల కోసం రిజర్వ్ ఫారెస్టులో నుంచి రోడ్డు వేయడం, లారీలతో ఇబ్బందులపై ప్రశ్నించిన ఓ ఉద్యోగిపై పోలీస్ స్టేషన్లోనే ఇసుక వ్యాపారులు చేయిచేసుకోడానికి ప్రయత్నించడం వంటి ఘటనలు పాయం ఇమేజ్ను మసకబారేలా చేశాయనే ఆరోపణలు వస్తున్నాయి. నియోజకర్గ అభివృద్ధిలో తనదైన మార్క్ కూడా చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్టు ‘ఎమ్మెల్యే పాయం తన ఇంటి ముందు ఉన్న రోడ్డునే బాగు చేయించుకోలేడు. ఇక నియోజకర్గాన్ని ఏం బాగు చేస్తాడు’ అంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి రేగా ఇప్పటికే మాటల దాడిని మొదలెట్టడం హస్తం పార్టీకి నష్టం కలిగించే విషయమే.
లెక్కసరిచేయని కోరం
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య రెండు సార్లు గెలిచాడు. తొలిసారి గెలిచినప్పుడు సీతారామ ప్రా జెక్ట్కు కీలకమైన రోళ్లపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆయన నియోజకర్గంలోనే ఉంది. తదుపరి ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక రోళ్లపాడుతో పాటు ఇల్లెందు నియోజకవర్గం కూడా సీతారామ లబ్ధిదా రుల జాబితా నుంచి మాయమైంది. రెండోసారి గెలిచాక సీతారామ నీళ్లు తెస్తారని ఇక్కడి ప్రజలు ఆశించగా.. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వం నుంచి కనీసం స్పష్టమైన హామీ కూడా సాధించలేకపోయారు. ఆఖరికి రూ.200కోట్లతో మంజూ రైన యంగ్ ఇండియా స్కూల్ పనులను సైతం పట్టాలెక్కించలేకపోయారు. ఇప్పటికే స్థలం, భవనాల కొరత వల్ల ఇల్లెందుకు సంబంధించిన గురుకుల విద్యాసంస్థలన్నీ పక్క నియోజకర్గాల్లో కొనసాగుతున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్కు చేటు, ప్రత్యర్థికి మేలు చేస్తున్నాయి.
తెల్లం తప్పులు కాంగ్రెస్ ఖాతాలో
భద్రాచలంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలి చిన తెల్లం వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్తో సన్నిహత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఉద్యోగాల కల్పన పేరుతో ఎమ్మెల్యే తెల్లం పీఏ కల్యాణ్ చేసిన వసూళ్ల దందా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం తాలుకూ ప్రతికూల అంశాలు కాంగ్రెస్ పార్టీకి చుట్టుకుంటున్నాయి. ఇదే అదనుగా అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. హస్తం పార్టీలో నష్టనివారణ చర్యలు చేపట్టేవారూ లేరు. దీనికి తోడు ఇక్కడ పొదెం వీరయ్య, తెల్లం వెంకట్రావు వర్గాలు ఉన్నా యి. వెయ్యిరోజలు పాలనలో వీరిద్దరు ఒక్కటిగా పనిచేసిన కార్యక్రమాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు.
కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు ఉన్నారు. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం మేయర్ స్థానం ఆ పార్టీకే దక్కింది. అదే సమయంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేత కరువయ్యారు. ఇప్పటికే ముగ్గురు కేబినెట్ మంత్రులు, ఎంపీ రేణుకా చౌదరి పేరుతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్లో నాలు గు గ్రూపులు పని చేస్తున్నాయి. అవే ఛాయలు కొత్తగూడెంలోనూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చి వెయ్యిరోజులు దాటినా ఇంతవరకు ఆ పార్టీకి కార్యాలయమే లేదు. వేర్వేరు వర్గాల వారీగానే ఆఫీసులు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సొంతూరు దమ్మపేట మండలం గండుగులపల్లి. ఇదే ఊరు నుంచి రాజకీయ దురంధరుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. గతంలో అశ్వారావుపేట, దమ్మపేటలు సత్తుపల్లి నియోజకర్గంలో భా గంగా ఉండేవి. దీంతో ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావుకంటూ ప్రత్యేక వర్గం ఉంది. దీంతో మంత్రి పొంగులేటి, జారే వర్గం, తుమ్మల వర్గం మధ్య నివురుగప్పిన నిప్పులా ఇక్కడ పరిస్థితి నెలకొంది.


