భద్రాచలం: స్వాతంత్య్ర ఫలమే ఏజెన్సీలో గిరిజనులు అభివృద్ధి అని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. జాతిపిత మహా త్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో విద్య, వైద్యం, ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతులు సాగునీరు, తాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాల్లో గిరిజనులు రాణిస్తున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, స్టాళ్లను పీఓ దంపతులు తిలకించారు. ఉద్యోగులకు కోయ భాషలో ముద్రించిన ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు, సాహస క్రీడల్లో రాణించిన ప్రతిభావంతులకు రూ.1,10,000, క్విజ్ పోటీల్లో గెలిచిన పాఠశాలలకు రూ. 50 వేలనుచెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆనందకుమార్, చందన,అరుణకుమారి, మధుకర్, రాంబాబు, సమ్మయ్య, వేణు, ఉదయ్ కుమార్, సైదులు, శ్రీధర్, రాధమ్మ, రమేష్ పాల్గొన్నారు.
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్


