గుండాల: మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని కరాటేలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. జిల్లా పరి షత్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గుండెబోయిన రిషిత ఏప్రిల్ 25న జరిగిన హైదరాబాద్లో 1212 మందితో జరిగిన కరా టే ప్రదర్శనలో పాల్గొంది. విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శన జరగ్గా, ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. ప్రదర్శనలో రిషి త కూడా పాల్గొనడంతో శనివారం పంద్రాగస్టు వేడుకల్లో ఎంఈఓ పార్వతమ్మ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. ప్రశంసాప్రతం, మెమోంటో అందించారు.
విద్యుత్ ఉద్యోగులకు అవార్డులు
భద్రాచలంఅర్బన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు అవార్డులు లభించాయి. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ చేతుల మీదుగా ఐటీడీఏలో ఉద్యోగులు బొల్లి వెంకటరాజు, జి. సర్వేశ్వరరావు, డి. పవన్ కుమార్, బి. సందీప్, ముక్తేశ్వరరావు, కె.వి. నరసింహారావు, హెచ్. లక్ష్మీనారాయణ అవార్డులు అందుకున్నారు.
అటవీశాఖ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
పాల్వంచరూరల్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అటవీశాఖలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 17మంది ఉద్యోగులకు ఉత్తమ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. పాల్వంచ టెరిటోరియల్ డివిజన్ పరిధిలో ఇద్దరు డీఆర్ఓలు, ఏడుగురు బీట్ ఆఫీసర్లు, ముగ్గురు సెక్షన్ ఆఫీసర్లు, ఐదుగురు అడ్మినిస్ట్రేట్ సిబ్బందికి ఎఫ్డీఓ కృష్ణప్రసాద్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.
వైల్డ్లైఫ్ విభాగంలో 18 మందికి..
వన్యప్రాణి సంరక్షణ విభాగం(వైల్డ్లైఫ్) డివిజన్లో 18 మంది ఉద్యోగులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఇందులో చాతకొండ రేంజర్ కనకమ్మ, శ్యామ్కుమార్(ఎఫ్బీఓ)లు సీసీఎఫ్ ద్వారా ప్రశంసాపత్రాలు అందుకోగా, మరో ఇద్దరు ఎఫ్బీఓలు జె.చంద్రయ్య, హన్మంతులు డీఎఫ్ఓ చేతుల మీదుగా, మరో 14మంది ఎఫ్డీఓ ద్వారా అందుకున్నారు.
ఆయిల్పామ్ తోటకు నిప్పు
కొణిజర్ల: గుర్తు తెలియని వ్యక్తులు ఆయిల్పామ్ తోటకు నిప్పంటించడంతో 12 ఎకరాల్లో మొక్కలు కాలిపోయాయి. మండలంలోని గుబ్బగుర్తికి చెందిన రైతు మోత్కూరి వెంకటేశ్వరావు గ్రామ సమీపాన ఏన్కూరు – పల్లిపాడు ప్రధాన రహదారి వెంట 12 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నాడు. దాదాపు నాలుగేళ్లు పూర్తికావడంతో కాపుకు వచ్చే సమయాన శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో చెట్లన్నీ కాలిపోయాయి. అలాగే, డ్రిప్ పైపులు కూడా కాలిపోవడంతో భారీ నష్టం ఏర్పడడంతో కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.


