పాల్వంచరూరల్: వన్యప్రాణి జాబితాలో ఉన్న ఉడుమును బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ యువకుడు కటకటాలపాలయ్యాడు. మండలంలోని ఉల్వనూరుకు చెందిన యాస చంటి నెల క్రితం కిన్నెరసాని అభయారణ్యంలో కుక్కల ద్వారా ఉడుమును వేటాడాడు. ఆపై దాన్ని హింసిస్తూ వీడియో తీసి ఇన్స్ట్రాగామ్లో పోస్టు చేశాడు. ఈ వీడియోను చైన్నెలోని వైల్డ్లైఫ్ కంట్రోల్ బ్యూరో(డబ్ల్యూసీబీ – సౌత్ రిజియన్) అధికారులు గుర్తించి పాల్వంచలోని వైల్డ్లైఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉల్వనూరులో రెండు రోజులుగా అటవీ శాఖ ఉద్యోగులు జి.కవితమాధురి, కృష్ణయ్య, బి.సునీత, ఈరులాల్, బి.వెంకట్రావ్ నేతృత్వాన గాలిస్తూ శుక్రవారం చంటిని అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం అత్యంత రక్షణ కలిగిన షెడ్యూల్డ్–1 జాబితాలో ఉడుము ఉండడంతో ఆయనపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు తరలించామని వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బి.బాబు తెలిపారు. కాగా, షెడ్యూల్–1 కింద చంటిపై నమోదైన కేసు ఈ ప్రాంతంలోనే మొదటిదని చెబుతున్నారు.
షెడ్యూల్డ్–1 అంటే..
వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 షెడ్యూల్–1 కింద అత్యంత అంతరించిపోతున్న దశలో ఉన్న, గరిష్ట రక్షణ అవసరమైన జంతువులను చేర్చారు. వీటిని వేటాడడం లేదా హానీ చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇలా చేసిన వారికి కఠినమైన జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ జాబితాలో పులి, సింహం, చిరుతపులి, ఖడ్గమృగం, కృష్ణజింక, మంచు చిరుత, ఎలుగుబంటి, మొసలి, ఉడుము వంటివి చేర్చారు.
చైన్నెలోని డబ్ల్యూసీబీ
అధికారుల సూచనలతో అరెస్ట్


