సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో శనివారం జరిగే స్వాతంత్య్ర ప్రధాన వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా ప్రభుత్వం తరఫున హాజరుకానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నేడు, రేపు సింగరేణి
సీఎండీ పర్యటన
రుద్రంపూర్: ఈ నెల 15న ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకలకు సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి హాజరుకానున్నారు. ఈక్రమంలో శుక్రవారమే ఆయన కొత్తగూడెం రానున్నారు. ఉదయం 9:30 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయంపై, మహిళా డిగ్రీ కళాశాలపై ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ప్రారంభించనున్నారు. దీంతోపాటు కార్పొరేట్లోని వివిధ విభాగాల అధికారులతో ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణాపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. శనివారం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొననున్నారు.
క్వాలిటీ జీఎం సమీక్ష
మణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఏరియాలో కొత్తగూడెం రీజియన్ జీఎం(క్వాలిటీ) సుజయ్ మజుందార్ గురువారం పర్యటించారు. ఏరియాలోని అన్ని విభాగాలను సందర్శించి, నాణ్యత ప్రమాణాలు సంబంధిత అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం దుర్గం రాంచందర్, ఇతర విభాగాల అధికారులు జీఎం చాంబర్లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు పాల్గొన్నారు.
నాటక రూపంలో బోధన
ఆంగ్ల ఉపాధ్యాయుడి వినూత్న ప్రయత్నం
అశ్వారావుపేటరూరల్: ఆంగ్ల బోధనకు ఓ ఉపాధ్యాయుడు వినూత్న ప్రయత్నం చేస్తూ, విద్యార్థులు భాషపై ఆసక్తి చూపేలా, పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో 6,7వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంలో ఉన్న ‘పురు–ది బ్రేవ్’పాఠాన్ని నాటక రూపంలో ప్రదర్శిస్తున్నారు. దీంతో విద్యార్థులు కష్టతరమైన ఆంగ్ల పదాలను సులువుగా అర్థం చేసుకుంటున్నారు. గురువారం పాఠశాలలో నాటకాన్ని ప్రదర్శించగా ఆకట్టుకుంది. వినూత్న ప్రయత్నం చేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు హలవత్ హరిబాబును పలువురు అభినందిస్తున్నారు.
‘సర్’లో చండ్రుగొండకు మొదటిస్థానం
చండ్రుగొండ: సర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంలో జిల్లాలోనే చండ్రుగొండ మండలం మొదటి స్థానంలో నిలిచిందని తహసీల్దార్ జగదీశ్వరప్రసాద్ తెలిపారు. గురువారం ఓటర్ల సవరణ ప్రక్రియను తహసీల్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్ ప్రక్రియ మండలంలో తుది దశకు చేరుకుందని, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో బీఎల్ఓలు ఓటర్ల జాబితా సవరణను చేపట్టారని వివరించారు. కుటుంబ సభ్యుల పేర్లు ఒకేచోట క్రమ సంఖ్యలో ఉండేలా బీఎల్ఓలు జాబితా సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. 27 బూత్లలో ఓటర్ల సవరణ జరుగుతుందని తెలిపారు. ముసాయిదా జాబితాను ఈనెల 17న విడుదల చేస్తామన్నారు.


