జూలూరుపాడు(సుజాతనగర్): ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. గురువారం సుజాతనగర్ మండలంలో సింగభూపాలెం, అంజనాపురం, వేపలగడ్డ గ్రామాల్లో పర్యటించారు. సింగభూపాలెం చెరువును సందర్శించి, నీటి నిల్వ పరిస్థితులను పరిశీలించారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా ఆరుతడి పంటలు పెసర, కూరగాయాలు సాగు చేసుకోవాలన్నారు. అనంతరం పాత అంజనాపురం రైతులు సాగు చేస్తున్న కూరగాయ పంటలు, పెసర, పత్తి, కాకర, సొరకాయ తదితర పంటలను పరిశీలించారు. ఆ తర్వాత సింగభూపాలెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలను, సర్వేను పరిశీలించారు. రూ.49 లక్షలతో నిర్మిస్తున్న మిషన్ భగీరథ నీటి సంప్ నిర్మాణ పనులను సందర్శించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి, బోధన, సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటించారు. వేపలగడ్డ మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలుర పాఠశాలను సందర్శించారు. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని వంట సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు, ఉద్యానవనశాఖ అధికారి కిషోర్ బాబు, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


