భద్రాచలం: రామాలయంలో త్వరలో కియోస్క్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆలయ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ప్రస్తుతం పడమర మెట్ల వద్ద నున్న టికెట్ కౌంటర్ భవనం సైతం తొలగించనున్నారు. దీంతో భక్తులు టికెట్ల కొనుగోలుకు ఇబ్బందులు పడకుండా కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. మిథిలా స్టేడియం, రామా నిలయం, సీఆర్వో కార్యాలయం, రంగనాయకుల గుట్టపై కాటేజీల వద్ద వీటిని ఉంచాలని భావిస్తున్నారు. డిజిటల్ పద్ధతిలో నగదు చెల్లించి ఆర్జిత సేవలు, ప్రసాదాలు ఇతర సేవలకు యంత్రాల ద్వారా టికెట్లు పొందేలా చర్యలు చేపట్టనున్నారు. యంత్రాల ఏర్పాటుపై గురువారం ఈఓ తన కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కియోస్క్ యంత్రాలను వితరణ చేయాలని కోరారు. సుమారు 10 యంత్రాలను అందుబాటులో ఉంచాల్సి ఉందని, తొలి విడతలో ఆరింటిని అందివ్వాలని అన్నారు. కాగా, ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని బ్యాంక్ అధికారులు తెలిపారు. వారు ఆమోదిస్తే యంత్రాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.
బ్యాంకర్లతో ఈఓ దామోదర్రావు సమావేశం


