జూలూరుపాడు/చండ్రుగొండ: ప్రశ్నించే ప్రతీ గొంతుక కమ్యూనిస్టుదేనని.. సమాజ మార్పునకు ఎర్రజెండానే దిక్సూచిగా నిలుస్తూ ప్రజలను కమ్యూనిస్టులు చైతన్యపరుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. సీపీఐ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం సుజాతనగర్, జూలూరుపాడు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా సభల్లో సాంబశివరావు మాట్లాడుతూ.. నరేంద్రమోదీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మత విద్వేషాలు రెచ్చిగొట్టి కాలం గడుపుతుందని ఆరోపించారు. దేశ సంపదంతా కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాగా, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యాన ప్రజాసామ్యం, రాజ్యాంగబద్దమైన హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పోరాటాలకు సిద్ధం కావాలని కూనంనేని పిలుపునిచ్చారు. కాగా, జూలూరుపాడు మండలం నుంచి యాత్ర చండ్రుగొండ మండలానికి చేరగా పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా మాట్లాడారు. గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలించే ముందు స్థానిక భూములకు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే, మండలంలోని వెంగళరావు ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేసి మూడు వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలన్నారు. పోడు భూముల వ్యవహారంలో అటవీ అధికారి శ్రీనివాసరావు మృతి బాధాకరమే అయినా, దీన్ని బూచిగా చూపించి పోడుదారులపై దౌర్జన్యాలు, దాడులు చేయటం సరికాదని పేర్కొన్నారు. యాత్రలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, నాయకులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, సరిరెడ్డి పుల్లారెడ్డి, చండ్ర నరేంద్రకుమార్, నరాటి ప్రసాద్, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, డి.వెంకన్న, భూక్యా దస్రు, భూక్యా శ్రీనివాస్, గుండెపిన్ని వెంకటేశ్వర్లు, హన్మంతరావు, లక్ష్మీకుమారి, వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, వీసంశెట్టి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాచైతన్య యాత్రలో
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని


