రెండు జిల్లాల్లో ఇద్దరు చొప్పున
● నకిలీ సర్టిఫికెట్లతో లెక్చరర్ ఉద్యోగాలు ● ఉమ్మడి జిల్లాలో నలుగురి గుర్తింపు, నోటీసులు
మధిర: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సన్మార్గంలో నడిపించాల్సిన వృత్తిలో ఉన్న అధ్యాపకులే దారి తప్పారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ సర్టిఫికె ట్లు సమర్పించినట్లు బయటపడడంతో ఉమ్మడి జిల్లాలో నలుగురు లెక్చరర్లు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వివరణ అందిన అనంతరం వారిపై కేసులు నమోదు చేసే అవకాశముంది.
2023లో నియామకం
గత ప్రభుత్వం 2023 ఏప్రిల్ 4న ప్రభుత్వ జూని యర్ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులను ఎంపిక చేసింది. తొలుత నియామకపత్రాలు ఇచ్చిన అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. అయితే, నియామకాల్లో అవకతవకలు జరిగాయని, పలువు రు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని విద్యార్థి సంఘాల నాయకులు, అప్పటి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. ఈమేరకు లెక్చరర్లగా నియమితులైన అందరి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్ట గా రాష్ట్రంలో 35మంది తప్పుడు సర్టిఫికెట్లు సమర్పి ంచారని టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ఉన్నట్లు బయటపడడం చర్చనీయాంశంగా మారింది.
బిహార్ సర్టిఫికెట్
మధిర జూనియర్ కాలేజీలో నియమితులైన గంటా కృష్ణ అంతకుముందు ములుగు జిల్లా వాజేడులో కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత రెగ్యులర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఆయన 2009లో బిహార్లోని బోద్గయలో ఉన్న మగధ యూనివర్సిటీలో పీజీ చేసినట్లు సర్టిఫికెట్ సమర్పించాడు. అయితే, టాస్క్ఫోర్స్ అధికారులు ఆరా తీయగా మగధ యూనివర్సిటీలో కృష్ణ పీజీ చేయలేదని, తాము సర్టిఫికెట్ జారీ చేయలేదని అక్కడి నుంచి సమాధానం వచ్చింది. దీంతో కృష్ణ నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు నిర్ధారిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈనెల 7న మధిర కాలేజీకి మెయిల్ పంపించారు. ఈమేరకు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీచేస్తూ, సమాధానం ఆధారంగా చర్యలు తీసుకోవడమే కాక క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అందులో పేర్కొన్నారు. ఈ విషయమై మధిర కాలేజీ ప్రిన్సిపాల్ శంకర్ను వివరణ కోరగా... కృష్ణ నకిలీ సర్టిఫికెట్ సమర్పించినట్లు మెసేజ్ వచ్చిందని తెలిపారు.
ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న గంటా కృష్ణ, వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న షేక్ రోషన్బీ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని టాస్క్ఫోర్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ లెక్చరర్ చాంద్పాషా, పినపాక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ యాకయ్య కూడా ఈ జాబితాలో ఉండడంతో వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కార్యాల యం నుంచి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.


