● క్రీడలతోపాటు చదువులోనూ తీర్చిదిద్దాలి ● కలెక్టర్ అంకిత్
పాల్వంచరూరల్: మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. పాల్వంచ మండలం కిన్నెరసానిలోని గిరిజన క్రీడాపాఠశాల, యానంబైల్లోని హైస్కూల్, పల్లె దవఖానా, రాజాపురంలోని అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. క్రీడాపాఠశాల తనిఖీ సందర్భంగా విద్య, క్రీడా శిక్షణ, వసతి, భోజన సౌకర్యాలపై ఆరాతీశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ప్రతిరోజు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఉద్యోగులకు సూచించారు. కాగా, విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిద్దిద్దాలని తెలిపారు.
యానంబైల్లో అసంతృప్తి
యానంబైల్ హైస్కూల్కు వెళ్లినప్పుడు మధ్యాహ్న భోజన సమయం కావడంతో పరిశీలించిన కలెక్టర్ మెనూ ప్రకారం ఆహారంఅందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా నిర్లక్ష్యం విడనాడాలని సూచించారు. అలాగే, యానంబైల్లోని పల్లె దవాఖానా తనిఖీ సందర్భంగా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ఆతర్వాత రాజాపురంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించి నిర్వహణపై సూచనలు చేశారు. తహసీల్దార్ దారా ప్రసాద్, వివిధ శాఖల ఉద్యోగులుపాల్గొన్నారు.


