పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలో నూతనంగా నిర్మించిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో మాఘమాసం త్రయోదశిని పురస్కరించుకుని సోమవారం అర్చకులు శ్రీ నందీశ్వరస్వామికి పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, నీరాజనం, మంత్రపుష్పం పూజ లు నిర్వహించారు.
నేడు రుద్రహోమం
మాసశివరాత్రిని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ విజయ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు రూ. 1,516 చెల్లించి గోత్ర నామాలను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 63034 08458 నంబరులో సంప్రదించాలని కోరారు.
రేక్ పాయింట్కు 2,635 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 2,635.47 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఈ యూరియాలో ఖమ్మం జిల్లాకు 1,275.47 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 600 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 660 మె.టన్నులు సరఫరా చేశామని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు వెల్లడించారు.
పార్ట్టైం విధానంలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ
భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఫ్యాకల్టీ పోస్టులను పార్ట్టైం విధానంలో భర్తీ చేయనుండగా, అర్హులైన గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. డిగ్రీ, పీజీలో 55శాతం మార్కులు కలిగి ఉండి, బీఈడీ, టెట్ ఉత్తీర్హులైన వారు అర్హులని పేర్కొన్నారు. మహిళా విభాగంలో టీజీటీ(హిందీ, గణితం, బయోసైన్స్, సోష ల్), జేఎల్(బోటనీ) ఐదు పోస్టులు ఉండగా, జనరల్ విభాగంలో పీజీటీ(హిందీ, ఇంగ్లిష్, సోషల్), జేఎల్(జువాలజీ) నాలుగు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సర్టి ఫికెట్ల జిరాక్స్లతో ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా భద్రాచలం ఐటీడీఏలోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 85001 36628 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మార్కులు, డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందని పీఓ తెలిపారు.
గురుకుల డిగ్రీ కళాశాలల్లో..
ఖమ్మం రీజియన్లోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ రాహుల్ తెలిపారు. పీజీలో 55శాతం మార్కులతో పాటు నెట్/సెట్/పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల్లో కామర్స్ ఆరు, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ రెండేసి పోస్టులతో పాటు గణితం, బోటనీ, కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్ ఒక్కో పోస్టు భర్తీ చేస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్ల జిరాక్స్లతో ఈనెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పాల్వంచ కేఎల్ఆర్ పీజీ కళాశాల ప్రాంగణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 98489 65711, 79893 25024 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు.
నేడు ‘పీఎం విశ్వకర్మ’ సదస్సు
చుంచుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు మంగళవారం కొత్తగూడెం క్లబ్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల నాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పీఎం విశ్వకర్మ యోజ న రాష్ట్ర కన్వీనర్, మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్, ఎంఎస్డీఈ డైరెక్టర్ రవికుమార్ హాజరై లబ్ధిదారులకు అందుతున్న పథకాలు, శిక్షణ, ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నా రు. ఈ సమావేశంలో నాయకులు కనుకుంట రాజమౌళి, శీలం విద్యాసాగర్, గొడుగు శ్రీధర్ యాదవ్ పాల్గొన్నారు.


