ఈ నెలాఖరులోగా పంపిణీ
● ఉచిత చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ కసరత్తు ● రూ.116 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ● 742 చెరువుల్లో కోటి 80 లక్షల చేప పిల్లలు వదలాలని లక్ష్యం
పాల్వంచరూరల్: ఉచిత చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మత్స్యశాఖ అధికారులు ప్రక్రియను ప్రారంభించారు. టెండర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఎల్నినో ప్రభావం కారణంగా ఈసారి చేపపిల్లల పంపిణీ ఉంటుందో ఉండదోనని మత్యకారులు ఒకింత ఆందోళన చెందారు. ఈ తరుణంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు, రొయ్యల పంపిణీకి రూ.116 కోట్ల మంజూరు చేస్తూ జీఓ విడుదల చేసింది.
81 మత్స్యపారిశ్రామిక సంఘాలు..
మత్స్య శాఖ గతేడాది 532 చెరువుల్లో కోటి 32 లక్షల చేప పిల్లలను పంపిణీ చేసింది. ఈ ఏడాది కోటి 80 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 35 నుంచి 40 ఎంఎం సైజువి 53 లక్షలు, 80 నుంచి 100 సైజు కలిగినవి కోటి 27 లక్షల చేప పిల్లలను 742 చెరువుల్లో వదలాలని నిర్ణయియించారు. ఇందులో పెద్ద చెరువులు 83, చిన్న చెరువులు 659 ఉండగా, జిల్లాలోని 81 మత్స్యపారిశ్రామిక సంఘాల్లో 3,500 మంది సభ్యులు ఉన్నారు.
అదును దాటాక పోస్తే చేప ఎదగదు
చేప పిల్లల పంపిణీ ప్రక్రియ గతేడాది కూడా నవంబర్లో జరిగింది. దీంతో చేపలు ఎదగక మత్స్యకారులకు తీవ్రనష్టం వాటిల్లింది. ఈ సారి కూడా ఆలస్యం చేయకుండా చేప పిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. అప్పుడే తమకు ప్రయోజనం జరుగుతుందని చెబుతున్నారు.
బొచ్చె, రవ్వ, శీలావతి
బొచ్చె, రవ్వ, శీలావతి మూడు రకాల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు మత్స్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి, ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బిడ్ల దాఖలుకు గడువు ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను సీడ్ సరఫరాకు జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేయనున్నారు. ఈ నెల 17వ తేదీలోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
జిల్లాలో ఈ ఏడాది 742 చెరువుల్లో కోటి 80 లక్షల చేపపిల్ల లను ఉచితంగా పంపిణీ చేస్తాం. 35 నుంచి 40 ఎంఎం చేపపిల్లలకు రూ.61, 80 నుంచి 100 ఎంఎం సైజు పిల్లలకు రూ.1.60 చొప్పున ధరలను నిర్దేశించాం. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటివారంలో చేప పిల్లల పంపిణీ పూర్తి చేస్తాం. కిన్నెరసాని చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో 8 లక్షల సీడ్ను ఇటీవల పోశాం. వాటిని కూడా సొసైటీలకు అందజేస్తాం.
–శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి


