ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయడమే కాక అలివేలు మంగ అమ్మవారికి సర్పంచ్ తుళ్లూరి నిర్మలకుమారి–కోటేశ్వరరావు దంపతులు బోనాలు, సారె సమర్పించారు. అలాగే, అర్చకులు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదం, స్వామి మూలవిరాట్కు అభిషేకం, స్వామి నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


