రెండు గంటల పాటు ఇంట్లో సోదాలు..
వేర్వేరుగా కుటుంబ సభ్యుల విచారణ
మరో ముగ్గురు అరెస్ట్
భద్రాచలంఅర్బన్: భద్రాచలం కేంద్రంగా జరిగిన రూ.52 కోట్ల మోసం కేసులో లక్ష్మీదేవిపల్లి పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం. నిందితుడు బేతంపూడి భరత్ ఇప్పటికే భద్రాచలం సబ్జైలులో ఉన్నాడు. తాజాగా మరో ముగ్గురు నిందితులు, అతని తల్లి రాజేశ్వరి, సోదరి శ్రీవిద్య, భార్య ఉషశ్రీలను శనివారం అరెస్ట్ చేశారు. తొలుత పట్టణంలోని కూనవరం రోడ్డులోని టీచర్స్కాలనీలో ఉన్న నిందితుడి ఇంట్లో సీఐ వెంకటేశ్వర్లుతో కూడిన పోలీస్ బృందం రెండు గంటలపాటు సోదా లు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు గంటలపాటు కుటుంబ సభ్యులను వేర్వేరుగా విచారించినట్లు సమాచారం. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు గంటలపాటు అక్కడే ఉన్న పోలీసులు ఆర్థిక లావాదేవీలు, నగదు ఎక్కడ దాచారు? తదితర కోణాల్లో విచారణ సాగించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రూ.52 కోట్లు మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అంతకు మించి మోసం చేశారా? ఈ వ్యవహారంలో ఇంకెవరి పాత్ర అయినా ఉందా? అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. బయటకు రాని బాధితుల గురించి కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, సోదాలు, విచారణలో లభించిన ఆధారాలు, తేలిన విషయాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
డబ్బుల ఆచూకీ కోసం ఆరా!


