భద్రాచలంఅర్బన్: ఏజెన్సీ ప్రాంతంలో కీలక వైద్యకేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ఐఎస్ఓ గుర్తింపు లభించినట్లు సమాచారం. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలు, రోగుల సంరక్షణ, వివిధ విభాగాల నిర్వహణ, సేవల ప్రమాణాలను పరిశీలించిన అనంతరం గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది. అధికారిక నిర్ధారణకు మరో మూడు నెలల సమయం ఉందని సమాచారం. 200 పడకల సామర్థ్యంతో కొనసాగుతున్న ఆస్పత్రిలో ఓపీ, అత్యవసర సేవలు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, లేబర్ రూమ్, ఎస్ఎన్సీయూ, ల్యాబ్, రక్తనిధి కేంద్రం, ఫార్మసీ తదితర విభాగాలు ఉన్నాయి. గత నెల 29న సందర్శించిన బీఎస్ఐ (బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్)కు చెందిన నలుగురు సభ్యుల బృందం ఆస్పత్రి సేవలపై సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ఐఎస్ఓ గుర్తింపు అధికారికంగా ఖరారైతే సేవల నాణ్యత, పరిశుభ్రత, రోగుల భద్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది జవాబుదారితనం వంటి అంశాలకు మరింత ప్రాధాన్యం లభిస్తుంది. కాగా ఆస్పత్రికి గతంలోనే రాష్ట్రస్థాయిలో పలు అవార్డులు వచ్చాయి.
మూడు నెలల్లో అధికారికంగా
ప్రకటించే అవకాశం


