ఇసుక లారీలకు బ్రేక్..
పినపాక: మణుగూరు, పినపాక మండలాల ఇసుక క్వారీల నుంచి బయలుదేరిన ఇసుక లారీలను శుక్రవారం పినపాక మండల శివారులో మంగపేట పోలీసులు నిలిపివేశారు. దీంతో ఉదయం నుంచే వందల సంఖ్యలో లారీలు కిలోమీటర్ల మేర బారులుదీరాయి. లారీడ్రైవర్ల కథనం ప్రకారం.. ఉదయాన్నే ఇసుక లోడ్ చేసుకుని ఏటూరునాగారం మార్గంలో బయలుదేరగా, మంగపేట వద్ద పోలీసులు వాహనాలను నిలిపివేశారని తెలిపారు. ఇసుక క్వారీ నిర్వాహకులు ఈ మార్గంలో వెళ్లొచ్చని చెప్పగా, ఇక్కడ పోలీసుల అనుమతి లేదంటూ అడ్డుకుంటున్నారని వాపోయారు. గంటల తరబడి రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంగపేట పోలీసులను వివరణ కోరగా, పైఅధికారుల ఆదేశాల మేరకే వాహనాలను నిలిపివేశామని తెలిపారు. హైదరాబాద్కు వెళ్లే లారీలు మణుగూరు – కొత్తగూడెం లేదా ఇల్లెందు – పాల్వంచ మార్గాల్లో వెళ్లాలని సూచించామని చెప్పారు.
వేటగాళ్ల ఉచ్చుకు
బలైన ఆవు..
కరకగూడెం: మండలంధిలోని కన్నాయిగూడెం గ్రామంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు ఓ ఆవు బలైంది. గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకయ్యకు చెందిన ఆవు శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని అడవికి మేత కోసం వెళ్లింది. గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన ఉచ్చు ఆవు మెడకు బిగుసుకుని, అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు విలువ సుమారు రూ.30 వేల వరకు ఉంటుందని యజమాని వెంకయ్య తెలిపారు.


