దమ్మపేట: పిల్లలకు కనీసం పేర్లు రాయడం, చదవడం నేర్పడంలో విఫలమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా మండలంలోని పార్కలగండి గ్రామ పంచాయతీ పరిధిలోని పాకలగూడెం, కొత్తూరు గ్రామాల్లో మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థుల రాత, పఠన సామర్థ్యాలను పరిశీలించి, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకలగూడెంలో ఐదో తరగతి విద్యార్థి, కనీసం తన ఊరి పేరు కూడా రాయలేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరు పాఠశాల సందర్శనలో గ్రామస్తులు తమ పిల్లలకు ఉపాధ్యాయులు ఏమాత్రం చదువు చెప్పడం లేదని ఎమ్మెల్యేకు నేరుగా ఫిర్యాదు చేశారు. ఊరి పేర్లు రాయడం, పాఠ్యాంశాలను చదవడంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించి, సెలవు పెట్టకుండా ఉపాధ్యాయుడు విధులకు హాజరు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఎమ్మెల్యే ఫోన్లో ఫిర్యాదు చేశారు.


