బూర్గంపాడు: లారీడ్రైవర్ అతివేగం.. నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని చిదిమేసింది. మోటార్ సైకిల్ను అతివేగంగా ఢీకొట్టడంతో పాటుగా 30 మీటర్ల మేరా లాక్కెళ్లింది. దీంతో ద్విచక్రవాహనదారుడి శరీరమంతా ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఐటీసీ పీఎస్పీడీలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు ఈ ఘటనలో మరణించాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో సారపాకలో విషాదం అలుముకుంది. మహబూబాబాద్ జిల్లా పెద్దతండా గ్రామానికి చెందిన గుగులోత్ శ్రీరామ్ (47) పదహారేళ్లుగా సారపాక కండక్టర్స్ కాలనీలో నివాసముంటూ ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం జనరల్ షిఫ్ట్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రా మెటీరియల్ లోడ్తో వస్తున్న లారీ సారపాక ఐటీసీ ఈస్ట్గేట్ సమీపంలో అతివేగంగా మోటార్ సైకిల్ను వెనుక నుంచి ఢీకొట్టింది. శ్రీరామ్ లారీ వెనుక టైర్ల కిందపడిపోయాడు. అతడిని లారీ 30 మీటర్ల వరకు లాక్కెళ్లడంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు.
హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా..
శ్రీరామ్ శుక్రవారం రాత్రి సారపాక నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంది. శ్రీరామ్ భార్యకు హైదరాబాద్లో శనివారం శస్త్ర చికిత్స ఉంది. అందుకోసం కుటుంబ సభ్యులు ముందుగానే వెళ్లి హైదరాబాద్లో ఉన్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరాల్సిన శ్రీరామ్ను మృత్యువు లారీ రూపంలో కబళించింది. శ్రీరామ్ తన ఏకై క కుమారుడికి గత మే నెలలోనే వివాహం చేశాడు. పెళ్లి చేసిన ఆనందం ముగియక ముందే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఎస్ఐ నాగభిక్షం ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
30 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో అక్కడికక్కడే ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి


