సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఐదేళ్ల పాప మృతి చెందిన ఘటనపై శుక్రవారం అధికారులు విచారణ చేపట్టారు. ఆర్ఎంపీ అర్హతకు మించి వైద్యం చేయడంతో పాప మరణించినట్టుగా ‘పరిధి దాటి.. ప్రాణం తీసి’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో మెడికల్ ఆఫీసర్ బాదావత్ వెంకటేశ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణలతో కూడిన ద్విసభ్య కమిటీ సుజాతనగర్ మండలం మాలపల్లిలోని బాధితుల ఇంటికి వెళ్లి విచారణ చేపట్టింది. నివేదికను డీఎంహెచ్ఓకు రాత పూర్వకంగా అందించారు. ‘ఆగస్టు 5 ఉదయం ఆరేళ్ల చిన్నారికి నీరసంగా ఉండటంతో పాటు ఫిట్స్ వచ్చాయి. దీంతో పాపను ఆమె కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మళ్లీ ఫిట్స్ వచ్చాయి. ఆ తర్వాత శరీరం మొత్తం గట్టిగా అయిపోయింది. కళ్లు తేలేసి స్పృహ లేకుండా పోయింది. ఆ సమయంలో నాడీ, శ్వాస రెండు లేకపోవడంతో పాప చనిపోయిందని తల్లిదండ్రులు నిర్థారించుకున్నారు. దీంతో కొత్తగూడెం వెళ్లకుండా మార్గమధ్యంలోనే వెనక్కి తిరిగి ఇంటికి వచ్చారు. గతంలో పాపకు ఎటువంటి అనా రోగ్య సమస్యలు లేవు, చాలా యాక్టివ్గా ఉండేది.’ అని ద్విసభ్య కమిటీ తన రిపోర్టులో పేర్కొంది.
స్పెషల్ పార్టీ
ఓవైపు ఆర్ఎంపీ/పీఎంపీ వైద్యుల దందాపై విమర్శలు ఆరోపణలు వస్తుంటే మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా నగర శివార్లలో ఉన్న ఫంక్షన్ హాల్లో భారీ పార్టీని ఏర్పాటు చేశా రు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలను ఆహ్వానించి, తమ ఆస్పత్రికి పేషెంట్లను రిఫర్ చేయాలని కోరుతూ ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేసినట్టు సమాచారం. సుజాతనగర్ ఘటన వెలుగులోకి వచ్చిన మరుసటి రోజే ప్రైవేటు ఆస్పత్రి, ఆర్ఎంపీలకు పార్టీ ఏర్పాటు చేయడం గమనార్హం. పైగా ఈ పార్టీకి వైద్య ఆరోగ్య శాఖ నుంచి కొందరు ఉద్యోగులు ప్రత్యేక అతిథులుగా హాజరైనట్టు సమాచారం.


