సూపర్బజార్(కొత్తగూడెం): ప్రతీఒక్కరు అవగాహన పెంపొందించుకుంటేనే సైబర్ నేరాల కట్టడి సాధ్యమవుతుందని ఎస్పీరోహిత్ రాజ్ తెలిపారు. ‘సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నానాటికీ సైబర్ నేరాలు పెరుగుతున్నందున విద్యార్థినులకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డిజిటల్ అరెస్ట్, పెట్టుబడులు, యాప్లు, మ్యూల్ అకౌంట్ల ద్వారా నిందితులు నమ్మించి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తక్కువ సమయంలో అధిక లాభాలు, ఉద్యోగ, సినిమా అవకాశాలు, తక్కువ వడ్డీ రుణాలు వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చే మెసేజ్లు, లింక్లను నమ్మొద్దని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, గోప్యమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని ఎస్పీ తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. అలాగే విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఈ సదస్సులో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐలు జితేందర్, శ్రీనివాస్, ప్రిన్సిపాళ్లు శారద, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్రాజ్


