కోడ్ వేసిన ఫైల్కే ఉద్యోగుల ఆమోదం
లేకపోతే వాహనదారులకు
ముప్పుతిప్పలు
కొత్తగూడెం కార్యాలయంలో
కనీస సౌకర్యాలు కరువే
కొత్తగూడెంఅర్బన్: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్ల హవా కొనసాగుతోంది. దాదాపు అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ఉంటున్నా కొత్తగూడెం కార్యాలయంలో మాత్రం ఏజెంట్లు ఓ అడుగు ముందుకేస్తున్నట్లు తెలిసింది. వాహనదారులకు అన్ని సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతు న్నా.. ఇక్కడ అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఎవరికి ఏ అవసరం కావాలన్నా ఏజెంట్లను కలవకుండా నేరుగా వెళ్తే ముప్పుతిప్పలు ఎదురవుతున్నాయి. ఇదే సమయాన ఏజెంట్లను కలిసి వారు చెప్పినంత చెల్లిస్తే లైసెన్స్లు, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్, రెన్యూవల్ ఇలా ఏ పనైనా క్షణాల్లో పూర్తవుతుంది. ఈక్రమాన వారు అన్ని వివరాలను నింపి ప్రత్యేక కోడ్ వేసి ఇచ్చే పత్రాన్ని కార్యాలయంలో సమర్పిస్తే దాని ఆధారంగా అంతా సాఫీగా సాగిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి.
నేరుగా వెళ్తే తిరగాల్సిందే...
సామాన్యులు లైసెన్స్, ఇతర పనుల కోసం నేరుగా అన్ని పత్రాలతో వెళ్లినా కార్యాలయంలో పనులు కావడం లేదని చెబుతున్నారు. ఫలితంగా ఏజెంట్ను ఆశ్రయిస్తే ఒకటి, రెండు రోజుల్లోనే లైసెన్స్, ఇతర ధ్రువీకరణ పత్రాలు అందుతున్నాయి. అయితే, డ్రైవింగ్ రాని వారు, నిబంధనలు తెలియని వారికి డబ్బులు తీసుకుని.. కనీస పరీక్షలు చేయకుండా లైసెన్స్ ఇప్పిస్తుండడంతో ప్రమాదాలు జరిగితే ఎవరు కారణమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోపక్క తనిఖీల సందర్భంగా పర్మిట్ లేని వాహనాలు కంటపడితే ఇష్టారాజ్యంగా డబ్బు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే వారికి రూ.వేలు, రూ.లక్షకు పైగా జరిమానా విధించిన ఘటనలు ఉన్నాయని తెలుస్తోంది. ఈక్రమాన అధికారులు – వాహనదారుల నడుమ కొందరు సిబ్బంది మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం.
ఆర్టీఓలో ఏజెంట్లదే హవా


